ఖాదీ...భవితకు దారేదీ?
ABN, First Publish Date - 2021-08-07T05:00:03+05:30
ఖాదీ...భవితకు దారేదీ?
- చేనేతకు చేయూత కరువు!
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిపై కార్మికుల ఆశలు
- పొందూరు ఖాదీకి పూర్వ వైభవం కల్పించాలని వేడుకోలు
(పొందూరు)
చేనేతకు చేయూత కరువవుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీకి క్రమేపీ ప్రోత్సాహం తగ్గుతోంది. ఫలితంగా చేనేత కార్మికులకు ఉపాధి కరువై.. బతుకు భారమవుతోంది. మరోవైపు స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీజీతో ప్రశంసలందుకున్న ఆంరఽధా ఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి (ఏఎఫ్కేకే) సంఘం.. ప్రస్తుతం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తోంది. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంఘ ఆదాయం.. నిర్వహణకే సరిపోతోంది. సంఘ భవనం కూడా శిథిలావస్థకు చేరింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం పొందూరు రానున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా చర్యలు చేపట్టాలని... పొందూరు ఖాదీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్మికులు కోరుతున్నారు. ఏఎఫ్కేకే సంఘం అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చేనేత ఖాదీరంగం.. సుడిగుండంలో చిక్కుకున్న నావలా తయారైంది. దీనిపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువవుతోంది. పారిశ్రామికీకరణతో మార్కెట్ను ముంచెత్తుతున్న మిల్లు వస్ర్తాలు.. చేనేత రంగాన్ని మరింత కుదేలు చేశాయి. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి కరువై.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది కులవృత్తిని వీడి బతుకుతెరువు కోసం వలసబాట పడుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు తప్ప.. తమ తలరాతలు మారడం లేదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 5వేల కుటుంబాలు చేనేత వృత్తిలో కొనసాగుతున్నాయి. జిల్లాలో 39 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు నేతలకు చేతినిండా పని కల్పిస్తూ లాభాల బాటలో నడిచే ఈ సంఘాలు ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువై.. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎంతో విశిష్టత
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖాదీకి ఎంతో విశిష్టత ఉంది. దశాబ్దాల కిందటే గాంధీజీ, నెహ్రూ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందింది. అగ్గిపెట్టెలో ఒదిగిపోయే.. నాణ్యమైన వస్ర్తాలు తయారుచేసే అద్భుత ప్రతిభ పొందూరు కార్మికుల సొంతం. వడుకునేత ప్రక్రియ కారణంగానే పొందూరుకు విశిష్ట ఖ్యాతి దక్కింది. ఇక్కడ ఖాదీ వస్ర్తాల తయారీ ప్రక్రియ అంతా చేతితోనే జరుగుతుంది. ప్రత్తి నుంచి దారం తయారీ చేసి.. దాంతో వస్ర్తాలు రూపొందిస్తారు. అందుకే పొందూరు ఖాదీ అంటే.. సాధారణ వ్యక్తుల నుంచి రాజకీయ నాయకులు, సినీప్రముఖుల వరకూ అందరికీ మక్కువ. అంతటి ప్రాముఖ్యం కలిగిన పొందూరు ఖాదీకి నేడు ప్రోత్సాహం కరువవుతోంది.
ఎన్నో ఒడిదొడుకులు
ఖాదీ వస్త్రాల తయారీ అత్యంత ఖర్చుతో కూడుకున్నది. వీటి తయారీకి అవసరమైన కొండప్రత్తి ఎర్రప్రత్తి లభ్యత తగ్గుతోంది. ప్రత్తిని శుద్ధిచేయడంలో వినియోగించే వాలు చేపముళ్లు దొరకడం కష్టమవుతోంది. ఖాదీ నేత వడుకు కార్మికులకు వచ్చే వేతనం అంతంతమాత్రమే. దీంతో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. నేటితరం ఈ రంగంపై ఆసక్తి చూపడం లేదు. పొందూరు ఖాదీ పేరుతో నకిలీ వస్ర్తాలు మార్కెట్లో తక్కువ ధరకే విక్రయించడంతో అసలు ఖాదీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాదీ వస్త్రాల నేత కార్మికులకు, వడుకు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఏఎఫ్కేకే సంఘం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం రాయితీలు తగ్గించడంతో ఖాదీ రంగం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటోది. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాల్సి అవసరం ఉంది. దీంతో పాటు వేగంగా ఖాదీవస్త్రాల తయారు చేసేలా ఆధునిక పరికరాలను అందజేస్తే ఖాదీకి మనుగడ ఉంటుందని చేనేత కార్మికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలివీ
చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దివంగత నేత ఎన్టీఆర్ హయాంలో టీడీపీ ప్రభుత్వం జనాతా ధోతీ పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించింది. 1985లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. 11 రకాల వస్త్రాలు చేనేత పరిశ్రమలోనే తయారవ్వాలి. వీటిని చట్టవిరుద్ధంగా తయారుచేస్తున్న వస్త్ర పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. నకిలీ చేనేత వస్త్రాల విక్రయాలను నిషేధించాలి. చేనేత వస్త్రాలకు వినియోగిస్తున్న నూలుపై సబ్సిడీ పెంచాలి. వస్త్రాల తయారీలో ఆధునిక పద్ధతులపై యువతకు శిక్షణ ఇవ్వాలి. చేనేత సహకార సంఘాల రుణాలను మాఫీచేసి ఆర్థిక సహకారం అందజేయాలి. ఆప్కో బకాయిలను చెల్లించాలి. పొందూరు, నరసన్నపేటలకు హెరిటేజ్ క్లష్టర్ హోదానివ్వాలి. పొందూరులో తెలంగాణలోని పోచంపల్లి తరహాలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలి. స్పిన్నర్లు నేతకార్మికుల వేతన రేట్లు పెంచాలి. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి, పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపునివ్వాలి. పొందూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పొందూరు రానున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని చేనేత కార్మికులు వేడుకుంటున్నారు.
సంఘం దశ తిరిగేనా?
పొందూరు పట్టణంలోని ఏఎఫ్కేకే సంఘం ప్రపంచప్రఖ్యాతి గాంచిన సన్నఖాదీ పాట్నూలు వస్త్రాల తయారీలో కీలకపాత్ర పోషిస్తోంది. ఖాదీ వడుకు నేత కార్మికుల కళాత్మక నైపుణ్యతతో రూపు దిద్దుకుంటున్న ఖాదీ వస్త్రాల ప్రాశస్ర్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఈ సంఘానికే దక్కుతుంది. స్వాతంత్య్ర పోరాటంలో విదేశీ వస్తువుల బహిష్కరణ సమయంలో దేశానికి వస్త్రాలను అందజేసి.. మహాత్మగాంధీజీతో ప్రశంసలు పొందింది. ఈ క్రమంలో ఖాదీ కార్మికుల సంక్షేమం కోసం 1949లో ఏఎఫ్కేకే సంఘాన్ని ఏర్పాటుచేసి భవనం నిర్మించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేవీఐసీ సహకారంతో వందలాది మంది నేత కార్మికులు, వేలాదిమంది వడుకు కార్మికులకు ఉపాధి చూపుతోంది. ఈ సంఘం ఆధ్వర్యంలో వస్త్రాల క్రయవిక్రయాల వల్ల వచ్చే ఆదాయం.. ఉద్యోగులు జీతాలు, సంఘం నిర్వహణకే సరిపోతోంది. మరోవైపు సంఘ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవనం నిర్మించుకోలేని దుస్థితి నెలకొంది. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సంఘ భవనాన్ని పరిశీలించారు. ప్రశంసలు, వాగ్దానాలకు మాత్రమే పరిమితమయ్యారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఈ సంఘాన్ని పరిశీలించనుండడంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నూతన భవన నిర్మాణానికిఆమె ఆర్థికంగా చేయూత అందిస్తారని కార్మికులు ఆశిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగి.. ఏఎఫ్కేకేను నడపడం తలకు మించిన భారమవుతోందని ఆ సంఘ అధ్యక్షుడు జి.కామేశ్వర ప్రసాద్ తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తున్న సంఘానికి ప్రభుత్వ చేయూత అవసరమన్నారు. అలాగే భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కార్యదర్శి డి.వెంకటరమణ విజ్ఞప్తి చేశారు.
ప్రయోజనాలు కల్పించాలి
పొందూరు ఖాదీ మనుగడ సాగించాలంటే.. నేత వడుకు కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి. అత్యంత తక్కువ మజూరు రేట్లతో ఖాదీవస్త్రాల నేతకు ఎవరూ ముందుకురారు. వడుకు మహిళా కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. వీరందరికీ మజూరు ధరలు పెంచడంతో పాటు సౌకర్యాలు కల్పించాలి.
- బస్వా మోహనరావు, నేత కార్మికుడు, జాతీయ అవార్డు గ్రహీత
చిత్తశుద్ధి కరువు
చేనేత కార్మికులపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కరువవుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా, చేనేత కార్మికుల బతుకులు మెరుగుపడడం లేదు. అరకొర సంక్షేమ పఽథకాలతో ప్రయోజనం దక్కడం లేదు.
- కాలెపు శ్రీనివాసరావు, పొందూరు చేనేత సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు
అభివృద్ధికి చర్యలు
చేనేత రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. 50 ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్లు అందజేస్తున్నాం.
- బషీర్, ఏడీ, చేనేత జౌళి శాఖ
Updated Date - 2021-08-07T05:00:03+05:30 IST