అనుమతి లేకుండా స్తంభాల ఏర్పాటు
ABN, First Publish Date - 2021-06-18T05:16:55+05:30
అనుమతి లేకుండా స్తంభాల ఏర్పాటు
- చోద్యం చూస్తున్న ట్రాన్స్కో అధికారులు
పలాస : స్థానిక హడ్కో కాలనీ ప్రాంతంలో అనుమతి లేకుండా అర్ధరాత్రి విద్యుత్ సిబ్బంది స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. స్తంభం, వైర్లు భిగించడానికి ప్రభుత్వానికి రూ.15 వేలు డీడీ తీసిన తర్వాత అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే అందుకు విరుద్ధంగా సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తు అక్రమంగా స్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణలేకపోవడంతో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తుండడంతో అధికారులంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఇదే అదనుగా రాత్రులు కాంట్రాక్టు సిబ్బంది విద్యుత్ స్తంభాలు వేసి ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. ఇటీవల శివాజీనగర్లో కూడా త్రీఫేజ్ మీటర్ ఇవ్వాల్సిన చోట ఒక్కో కనెక్షన్ ఇచ్చారు. అలాగే పలాస ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకుండానే విద్యుత్ స్తంభాలు వేశారు.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం...
అనుమతి లేకుండా విద్యుత్ స్తంబాలు వేస్తే నేరమని ట్రాన్స్కో డీఈ జీఎన్ ప్రసాదరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ విషయంపై విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Updated Date - 2021-06-18T05:16:55+05:30 IST