ఆందోళన చెందవద్దు...క్షేమంగానే ఉన్నాం
ABN, First Publish Date - 2021-07-25T05:26:57+05:30
సముద్రంలో దారితప్పిన సోంపేట, కవిటి మండలాలకు చెందిన వలస మత్స్యకారులు తామంతా క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందవద్దని సమాచారం తెలియజేశారు.
‘ఆంధ్రజ్యోతి’కి సమాచారం తెలియజేసిన వలస మత్స్యకారులు
సోంపేట/రూరల్: సముద్రంలో దారితప్పిన సోంపేట, కవిటి మండలాలకు చెందిన వలస మత్స్యకారులు తామంతా క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందవద్దని సమాచారం తెలియజేశారు. ఈ మేరకు సోంపేట మండలంలోని ఇస్కలపాలెం, రామయ్యపట్నం, కవిటి మండలంలోని పెద్దకర్రివానిపాలెం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు శనివారం ఫోన్లో ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. బోటులో దారి తప్పిపోయిన 11 మంది మత్స్యకారులు చెన్నై తీరానికి క్షేమంగా చేరుకున్నామని తెలిపారు. సముద్రంలో దారి మళ్లి అండమాన్ తీరానికి చేరి అక్కడి నుంచి చెన్నై చేరుకున్న విషయం విదితమే. తమలో చాలామంది కుటుంబాలు చెన్నైలోనే ఉంటుండడంతో తాము సోంపేట రావడం లేదని స్పష్టం చేశారు. తమ స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడామని చెప్పారు. తాము క్షేమంగా చెన్నై చేరేందుకు కృషిచేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Updated Date - 2021-07-25T05:26:57+05:30 IST