లక్ష్యానికి దూరంగా..!
ABN, First Publish Date - 2021-02-23T04:57:54+05:30
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. కొవిడ్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు ముందుగా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నెల రోజులు దాటినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు.
మందకొడిగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ
నెల రోజుల్లో లక్ష్యం 51,922 మందికి
వేసింది 32,534 మందికి మాత్రమే..
(ఇచ్ఛాపురం రూరల్)
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. కొవిడ్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు ముందుగా కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. నెల రోజులు దాటినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. కొవిడ్ వ్యాక్సిన్పై అపోహలున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ముందుగా టీకా వేయించుకున్నారు. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కానీ వేలాదిమంది వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.
నెల రోజులు దాటినా
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నెల రోజులు దాటింది. 51,922 మందికి ముందుగా టీకా వేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ 32,534 మందికి మాత్రమే వేశారు. టీకాపై అపోహలతో వేయించుకునేందుకు చాలామంది వెనుకంజ వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది 19,772 మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకూ 16,264 మందికి మాత్రమే వేశారు. అంటే 60 శాతం మాత్రమే పూర్తిచేశారు. కొవిడ్ వారియర్స్గా ఉన్న పోలీస్, పారిశుధ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది 32,149 మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం విధించగా, 16,270 మందికి వేశారు. 50 శాతం మందికి మాత్రమే వేయగలిగారు. వ్యాక్సినేషన్తో ఇతర సమస్యలు (సైడ్ ఎఫెక్ట్స్) ఎక్కువ అన్న ప్రచారం నేపథ్యంలో సుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో 15 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులు తొలుత షెడ్యూల్ తయారు చేశారు. దీనికి అనుగుణంగా వ్యాక్సినేషన్ జరగడం లేదు. వైద్యులు, వైద్య సేవలందించే ఇతర సిబ్బంది ఆసక్తి కనబరచడం లేదు. ఈ ప్రభావం రెండో దశ వ్యాక్సిన్ ప్రక్రియపై పడుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రెండో డోస్ ప్రారంభించాం
అందరికీ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకూ హెల్త్వర్కర్స్కి 60 శాతం, ఫ్రంట్లైన్ వారియర్స్కు 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాం. 7,718 మందికి రెండో డోస్ కూడా వేశాం. కొంత మందిలో టీకాపై అపోహ ఉండడంతో వేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. అటువంటి వారికి అవగాహన కల్పిస్తున్నాం. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటాం.
- కె.లీల, డిప్యూటీ డీఎంహెచ్వో, శ్రీకాకుళం.
Updated Date - 2021-02-23T04:57:54+05:30 IST