అధ్వాన భోజనం.. అవహేళన!
ABN, First Publish Date - 2021-12-05T05:30:00+05:30
‘అన్నంలో రాళ్లు వస్తున్నాయి. కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు చేస్తున్నారు. దుర్వాసన వస్తున్న భోజనాన్ని తినలేకపోన్నాం. వార్డెన్ను అడిగితే హేళనగా మాట్లాడుతోంది. వంటమనిషితో కలిసి దుర్భాషలాడుతోంది. కాస్మొటిక్స్ నిధులు కూడా ఇవ్వడం లేదు’ అని దర్శి మోడల్ స్కూల్ విద్యార్థినులు ఆరోపించారు. వార్డెన్ తీరుకు నిరసనగా వారు ఆదివారం ఆందోళనకు దిగారు.
దర్శి మోడల్ స్కూల్ వార్డెన్
తీరుపై విద్యార్థినుల ఆగ్రహం
హాస్టల్ వద్ద ఆందోళన
వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
జడ్పీచైర్పర్సన్, డీఈవో
సర్దిచెప్పినా శాంతించని బాలికలు
తాత్కాలికంగా వార్డెన్ తొలగింపు
దర్శి, డిసెంబరు 5 : ‘అన్నంలో రాళ్లు వస్తున్నాయి. కుళ్లిపోయిన కూరగాయలతో కూరలు చేస్తున్నారు. దుర్వాసన వస్తున్న భోజనాన్ని తినలేకపోన్నాం. వార్డెన్ను అడిగితే హేళనగా మాట్లాడుతోంది. వంటమనిషితో కలిసి దుర్భాషలాడుతోంది. కాస్మొటిక్స్ నిధులు కూడా ఇవ్వడం లేదు’ అని దర్శి మోడల్ స్కూల్ విద్యార్థినులు ఆరోపించారు. వార్డెన్ తీరుకు నిరసనగా వారు ఆదివారం ఆందోళనకు దిగారు. వసతి గృహం వద్ద ధర్నా చేపట్టారు. జడ్పీ చైర్పర్సన్, డీఈవో వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు శాంతించలేదు. తమను ఇబ్బందులకు గురిచేస్తున్న వార్డెన్పై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఆమె విధులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఈవో ప్రకటించడంతో ఆందోళన విరమించారు. పట్టణంలోని మోడల్ పాఠశాల వసతి గృహంలో ఇంచుమించు 55 మంది బాలికలు ఉంటున్నారు. తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని వారు పలుసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. వార్డెన్ తీరు మార్చుకోకపోగా మరింతగా వేధించడం ప్రారంభించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు వసతి గృహం వద్దే ఆందోళనకు దిగారు. వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాఠశాలను సందర్శించిన జడ్పీ చైర్పర్సన్, డీఈవో
సమాచారం అందుకున్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వెంటనే మోడల్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడారు. వసతి గృహాన్ని పరిశీలించి నాసిరకం సరుకులు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం డీఈవో విజయభాస్కర్ కూడా అక్కడికి చేరుకున్నారు. డీఈవో సమక్షంలో జడ్పీ చైర్పర్సన్, డిప్యూటీ డీఈవో అనితారాజ్రాణి, ఎంఈవో రఘురామయ్య, ప్రిన్సిపాల్ హసీనాభానులు సమావేశమయ్యారు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థినిల వద్దకు వచ్చి భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో విజయభాస్కర్ హామీ ఇచ్చారు.
చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టు
తాము ఫిర్యాదు చేసిన ప్రతి సారీ చర్యలు తీసుకుంటామని అధికారులు ఇస్తున్న హామీలు అమలు కావడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వార్డెన్తోపాటు, వంట మనిషి నుంచి వేధింపులు మరింత పెరుగుతున్నాయని వాపోయారు. డీఈవో కారెక్కుతుండగా తిరిగి ఆయన్ను అడ్డగించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కారు ముందు భైఠాయించడంతో తిరిగి డీఈవో వారితో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వార్డెన్ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మరొకరిని నియమించే వరకు స్కూల్లోని ఒక ఉద్యోగికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం తరఫును చూసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
Updated Date - 2021-12-05T05:30:00+05:30 IST