‘రెవెన్యూ స్పందన’లో ఆన్లైన్ అక్రమాలపై నిలదీత
ABN, First Publish Date - 2021-10-21T05:30:00+05:30
పలు చోట్ల గురువారం జరిగిన రెవెన్యూ స్పందన గ్రామ సభలకు స్పందన కరువైంది. రాచర్లలో భూముల ఆన్లైన్ల అక్రమాలపై అధికారులను బాధితులు నిలదీశారు.
‘రెవెన్యూ స్పందన’లో ఆన్లైన్ అక్రమాలపై నిలదీత
రాచర్లలో తహసీల్దార్కు అర్జీల అందజేత
న్యాయం చేయాలంటూ బాధితుల విజ్ఞప్తి
సదస్సులకు కానరాని స్పందన
రాచర్ల, అక్టోబరు 21 : పలు చోట్ల గురువారం జరిగిన రెవెన్యూ స్పందన గ్రామ సభలకు స్పందన కరువైంది. రాచర్లలో భూముల ఆన్లైన్ల అక్రమాలపై అధికారులను బాధితులు నిలదీశారు. స్పందన సదస్సులో ఊహించని ఘటనతో అధికారులు షాక్కు గురయ్యారు. రాచర్ల మండలంలో నిర్వహించిన సదస్సులో ఏకంగా తహసీల్దార్ను బాధితులు నిలదీశారు. 13 సచివాలయాల పరిధిలో జరిగిన గ్రామసభల్లో భూముల అక్రమ ఆన్లైన్పై అర్జీలు అందాయి. రాచర్ల మండలంలో ఇటీవల భూముల ఆన్లైన్ ప్రక్రియలో మోసాలు జరిగిన విషయం తెలిసిందే. ఒకరి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేరుతో ఆన్లైన్ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో భూముల ఆన్లైన్లో అక్రమాలపై చర్యలు తీసుకొని ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రజలు అర్జీలు సమర్పించారు. ఆన్లైన్ చేయించుకున్నవారిపైనా, చేసిన అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు అర్జీలు అందజేశారు. ఆకవీడులో బచ్చిగారి విరేశలింగమ్మకు చెందిన ఎకరా పొలం రెడగారి గురువయ్యకు చెందిన 1.87 ఎకరాలు తమకు తెలియకుండానే వేరే వారికి ఆన్లైన్ చేశారని, ఆకవీడు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. రాచర్ల సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని తహసీల్దార్ ఇబ్రహీం ఖలీల్ పరిశీలించారు. తహసీల్దార్ వచ్చిన సమయంలో అనేక మంది వచ్చి రెవెన్యూ సిబ్బంది భూ ఆక్రమలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు ఇంతవరకు తీసుకోలేదని, ఒకరి భూములు మరొకరికి, సర్వే నెంబర్లు మరొకరికి మార్చేశారని అయినా నేటికీ పట్టించుకోలేదని తహసీల్దార్ను నిలదీశారు. తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నానని, స్పందనలో వచ్చే అర్జీలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మొత్తం మీద మండలంలోని 14 పంచాయతీ పరిధిలో 69 అర్జీలు అందినట్లు తహసీల్దార్ తెలిపారు.
రెవెన్యూ స్పందనను వినియోగించుకోవాలి : ఆర్డీవో
పుల్లలచెరువు : రెవెన్యూ స్పందన కార్యక్రమాన్ని రైతులు వినియోగించు కోవాలని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అన్నారు. గురువారం పుల్లలచెరువు మండలం చాపలమడుగు, పిడికిటివారిపల్లె గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో ఆర్డీవో పాల్గొని అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ ములను ఇప్పటికే ఆడిట్ చేశామన్నారు. త్వరలోనే ఆక్రమణలో ఉన్న భూ ములను వెనక్కి తీసుకుంటామని లక్ష్మీశివజ్యోతి తెలిపారు. చుక్కల భూములకు తగిన ఆధారాలు అందజేస్తే ఆన్లైను చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీలను పరిశీలించి సక్రమంగా ఉన్నవాటిని త్వరితగతిన పరిష్క రించాలని అధికారులను ఆర్డీవో ఆదేశించారు. మండలంలో రెవెన్యూ స్పందనకు 312 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహ సీల్దార్ కె.దాసు, వీఆర్వోలు కిషోర్, తిరుపతి రెడ్డి, వాసు, చంద్రశేఖర్, నాసరయ్య, కోటేశ్వరరావు, ఖాదర్, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
వై.పాలెంలో..
ఎర్రగొండపాలెం : అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 4వ గ్రామసచివాలయంలో గురువా రం రెవెన్యూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఆమె పరిశీలిం చారు. మండలంలో 21 గ్రామసచివాలయాల నుంచి 337 అర్జీలు అందాయి. మండలంలో అడంగల్ కరక్షన్ 49 అర్జీలు, మ్యుటేషన్లు 128, ఆన్లైన్ భూసమస్యలు 12, భూముల ఆక్రమణపై 9, పట్టాభూముల వివాదాలపై 1, నివేశస్థలాలకు వినతులు 95, సర్వేకు అర్జీలు 37, చుక్కలు భూములకు 1, 22(1)ఏ కు 1, ఇతర అర్జీలు 4, మొత్తం 337 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ వీరయ్య, ఆర్ఐ ఫిరోజ్, వీఆర్వో పోతూలూర య్య, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
గిద్దలూరుటౌన్లో..
గిద్దలూరు టౌన్ : రెవెన్యూ స్పందనలో భూసమస్యలను రైతులు పరిష్కరించుకోవాలని తహసీల్దార్ ప్రేమ్కుమార్ అన్నారు. పట్టణంలోని కోటగడ్డవీధిలోని సచివాలయంలో స్పందన సభ నిర్వహించారు. తహసీల్దార్ రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వీఆర్వో రంగయ్య, కౌన్సిలర్ లొక్కు రమేష్ పాల్గొన్నారు.
కంభంలో స్పందన కరువు
కంభం : గ్రామ, వార్డు సచివాలయాలలో గురువారం ఏర్పాటు చేసిన రెవెన్యూ స్పందన కార్యక్రమానికి స్పందన కరువైంది. పలుచోట్ల అర్జీదారులు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయాయి. మొదటి రోజు గురువారం ఈ కార్యక్రమాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు అధికారులు, సర్పంచ్లు ఉన్నా ప్రజల నుంచి స్పందన లేదు. అర్జీదారులు కొందరు సమస్యలను వీఆర్వోలకు చెప్పుకోవడం కనిపించింది.
తర్లుపాడులో..
తర్లుపాడు : గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరి స్తామని తహసీల్దార్ శైలేంద్రకుమార్ తెలిపారు. గురువారం మండలంలోని 16 పంచాయతీల్లో రెవెన్యూ స్పందన గ్రామ సభలు నిర్వహించారు. కలుజువ్వ లపాడు, రాగిసముద్రం, తుమ్మలచెరువు గ్రామాల్లో రెవెన్యూ స్పందన గ్రామ సభల్లో తహసీల్దార్ శైలేంద్రకుమార్ పాల్గొన్నారు. 16 పంచాయతీలలో 79 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ ఎన్వీ రమణ, వీఆర్వోలు, సర్పంచ్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
పొదిలిలో..
పొదిలి : రెవెన్యూ స్పందన గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను వెంటనే పరి ష్కరించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెం కటేశ్వర్లు ఆదేశించారు. గురువారం జరిగిన స్పందన సభలో ఆయన పా ల్గొన్నారు. మండలంలోని 17 సచివాలయాల పరిధిలో 96 అర్జీలు అం దాయి. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ ఎస్కెఎమ్డీ రఫి, ఇన్చార్జి ఆర్ఐ కె.సుబ్బారావు, సర్వేయర్ బ్రహ్మం, వీఆర్వోలు పాల్గొన్నారు.
త్రిపురాంతకంలో..
త్రిపురాంతకం : మండలంలోని 21 గ్రామ సచివాలయాలలో గరువారం నిర్వహించిన రెవెన్యూ స్పందన కార్యక్రమానికి 52 అర్జీలు అందాయి. భూముల కొలతలు, చుక్కల భూములు, ఆన్లైన్ తదితర సమస్యలపై రైతులు నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామ సభలలో ఆర్ఐ విజయభాస్కర్, సర్వేయర్ గురవయ్య, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST