కాలువల నిర్మాణం అస్తవస్తం
ABN, First Publish Date - 2021-12-19T05:11:46+05:30
దోర్నాలలో మురికి కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది.
భూగర్భ డ్రైనేజీలపై నెరవేరని మంత్రి సురేష్ హామీ
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
పెద్ద దోర్నాల, డిసెంబరు 18 : దోర్నాలలో మురికి కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇళ్ల నుంచి వాడుక నీరు బయటకు వెళ్లే వీలు లేక ప్రధాన రోడ్లపైనే చేరి నిలిచి ఉంటోంది. దీంతో తీవ్రమైన కంపు వెదజల్లుతోంది. దోర్నాల మేజర్ పంచాయతీలో రోజురోజుకు గృహ సముదాయాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా పంచాయతీలో వసతు లు సమకూరడంలేదు. ప్రధానంగా మురికి కాలువల నిర్మాణాలు సక్రమంగా లేవు. 1997లో నిర్మించిన కాలువలే దిక్కయాయ్యయి. అప్పటి ఇంజ నీరింగ్ అధికారులు కాలువల నిర్మాణంలో అంచనాలు సక్రమంగా రూపొందించక, ఎగుడుదిగుడుగా కాలువలు నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఎక్కడి మురికి నీరు అక్కడే నిల్వ ఉంటోంది. పాలకులు మారినా ఎంత మంది సర్పంచ్లు, అధికారులు మారినా కాలువల పునర్నిర్మాణం చేపట్టక పోవడంతో నివాసితులకు అవస్థలు తప్పడంలేదు. వర్షాకాలమైతే మరీ ధారుణం. ఇంటి ముందర ఉన్న రోడ్డంతా మురికినీరు రోజుల తరబడి నిల్వ ఉండి ఈగలు, దోమల దాడి, దుర్వాసనతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి పిల్లలు వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మిగతా రోజుల్లో కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దోమలు, ఈగలు వృద్ధి చెంది డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అడిగినప్పుడు వచ్చి చెత్త తీయడం కాదు, శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు.
భూగర్భ కాలువల నిర్మాణంతో శాశ్వత పరిష్కారం
ఇంటికి ప్రధాన రహదారి ఎంత అవసరమో మురికి కాలువ కూడా అంతే అవసరం. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 70 శాతం సిమెంటు రహదారులు నిర్మించారు. మురికి కాలువల నిర్మాణాలకు చక్కటి అవకా శం ఉంది. దోర్నాల పక్కనే తీగలేరు వాగు ఉంది. అన్ని వీధులలో మురికి కాలువల నిర్మాణాలు వాలుగా నిర్మించి తీగలేరు వాగుకు అనుసంధానం చేసినట్లయితే ఎక్కడా చుక్క నీరు కాలువల్లో నిలువ ఉండదని పలువురు అంటున్నారు. ఇప్పటికే ఉన్న కాలువలను పునర్నిర్మించాలని, లేని చోట కొత్తగా నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీని చేపట్టినట్లయితే ఏ సమస్యా ఉండదని మరి కొందరు అంటున్నారు.
రూ.3కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణం
అటకెక్కిన మంత్రి సురేష్ హామీ
దోర్నాలలో మురికి కాలువలను పునర్నిర్మించాలని ప్రజలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రూ.3 కోట్ల నిధులతో అండర్ డ్రైనేజ్ నిర్మిస్తామని చాలా సార్లు బహిరంగ సభలో తెలిపారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా పని చేస్తున్నారు. పైగా ఇటీవల ఆదివాసీల దినోత్సవం నాడు కురిసిన చిన్న పాటి వర్షానికి వీధులన్నీ నీటితో నిండిపోయాయి. నివాసితుల కోరిక మేరకు మంత్రి వెళ్లి పరిశీలించారు. తాత్కాలికంగా నీటిని తోడించారు. కానీ శాశ్వత పరిష్కారంగా ఆయన ఎన్నో సార్లు చెప్పిన అండర్ డ్రైనేజీ నిర్మాణంపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Updated Date - 2021-12-19T05:11:46+05:30 IST