మిరప కోత .. కూలీల కొరత
ABN, First Publish Date - 2021-04-13T05:40:11+05:30
వలేటివారిపాలెం మండలంలోని మిరప రైతులను కూలీల కొరత వేదిస్తోంది. కూలీలు ఉపాధి పనులకు అదికంగా వెళ్తుండడంతో అన్నదాతకు కూలీలు దొరకడం లేదు.
వలేటివారిపాలెం, ఏప్రిల్ 12 : వలేటివారిపాలెం మండలంలోని మిరప రైతులను కూలీల కొరత వేదిస్తోంది. కూలీలు ఉపాధి పనులకు అదికంగా వెళ్తుండడంతో అన్నదాతకు కూలీలు దొరకడం లేదు. మండలంలో సాగునీటి వనరులు ఉన్న రైతులు ఈ ఏడాది అధికంగా మిరప సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పాటు చీడపీడలు మిరపను ఆశించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. అయినప్పటికి వచ్చిన పంటను కోత కోసి ఇంటికి చేర్చి మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుందామని ఆశిస్తున్న తరుణంలో రైతులకు కూలీలు కొరత గుదిబండగా మారింది.
మండలంలో ఇంచుమించు 800 ఎకరాలలో ఈ ఏడాది మిర్చి సాగుచేశారు. అయితే నూతన ఆర్దిక సంవత్సరం ప్రారంభమైన నేపద్యంలో ఉపాధి పనులు పెంచాలనే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధి కూలీలు వ్యవసాయ పనులకు రావడం లేదని, ఉపాధి పనులకు వెళ్తున్నారని మిర్చి రైతులు చెబుతున్నారు. అంతేగాకుండా ఉపాధి పనులలో కూడా రూ.200 లకు తగ్గకండా కూలీ పడుతుండడంతో అటువైపు వెళ్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మిర్చి కోతలకు రోజుకు రూ.250లు చెల్లిస్తామన్నా కూలీలు రావడం లేదని చెబుతున్నారు. దీనికి తోడు ప్రక్క గ్రామాల కూలీలకు రవాణా చార్జీలు అదనంగా రూ 50లు చెల్లించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అయినప్పటికీ, కూలీలకు మిరపకోతకు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
Updated Date - 2021-04-13T05:40:11+05:30 IST