‘చేయూత’ ఎంపికలో వలంటీర్ల ఇష్టారాజ్యం
ABN, First Publish Date - 2021-06-08T06:05:19+05:30
జగనన్న చేయూత జాబితా ఎంపికలో వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఒకే ఊర్లోని 30 మంది మహిళల పేర్ల తొలగింపు
టీడీపీ వర్గీయులం అంటూ బాధితుల ఆరోపణ
వాళ్లంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు
క్రిష్ణాపురం(ఉలవపాడు), జూన్ 7 : జగనన్న చేయూత జాబితా ఎంపికలో వలంటీర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 30 మంది మహిళలను మూకుమ్మడిగా అనర్హులుగా చేశారు. వీళ్లంతా ఒకే సామాజిక వర్గానికి(యాదవ) చెందిన మహిళలు కావడం గమనార్హం. రాజకీయకక్షల నేపథ్యంలో వలంటీర్ల సహకారంతో మండలంలోని కృష్ణాపురంలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళల వివరాల మేరకు.. గత సంవత్సరం గ్రామంలో 45 ఏళ్లు దాటిన 189 మహిళలు జగనన్న చేయూత పథకానికి అర్హత పొంది రూ.18750 లబ్ధిపొందారు. రెండో విడత వచ్చేసరికి గ్రామంలోని ఒకే సామాజిక వర్గానికి చెందిన 30 మంది మహిళలను వలంటీర్ల లాగిన్ నుంచి రిజెక్ట్ చేశారు. విషయం తెలిసిన బాధిత మహిళలు సచివాలయం కార్యదర్శి ప్రసాద్ను ప్రశ్నించారు. వలంటీర్లు చేసిన రిజెక్ట్కు తన లాగిన్లో కారణం తెలిపే ఆప్షన్ లేదని చెప్పాడు. గ్రామ వలంటీర్లే స్థానిక అధికార పార్టీ నాయకులతో కలసి మూకుమ్మడిగా తమ పేర్లు తొలిగించారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కృష్ణాపురంలో టీడీపీ మద్దతుదారు గెలిచారు. ఆ సమయంలో ఒకరిద్దరూ వలంటీర్లు సంక్షేమ పథకాలు కావాలంటే అధికార పార్టీకి మద్దతు తెలపాలని హెచ్చరించినట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. చేయూత అర్హులను ఎంపిక విషయంలో వలంటీర్ల లాగిన్లో సెలెక్ట్, రిజెక్ట్ రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒక వలంటీర్ మొబైల్ ఫొన్తో తోటి వలంటీర్కు తెలియకుండానే లాగిన్ అయ్యి అతని డేటా మొత్తం తెలుసుకోవచ్చని కొం దరు వలంటీర్లు చెప్తున్నారు. ప్రతి వలంటీర్ మొబైల్ లాగిన్ అవ్వాలంటే అతని ఆధార్ నంబర్తో పుట్టిన రోజు పాస్ వర్డ్ లింక్ అయ్యి ఉంటుంది. వలంటీర్ ఆధార్ నెంబర్, పుట్టిన రోజు తెలిసిన ఎవరైనా చేయూత పథకంతో లాగిన్ కావొచ్చు. పాస్వర్డ్ మార్చుకునే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి ఇదేవిధంగా తోటి వలంటీర్లు లబ్ధిదారులను రిజె క్ట్ చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సోమవా రం ఉలవపాడులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే మహీధర్రెడ్డికి బాధిత మహిళలు వినతిపత్రం అందించారు. దీంతో ఆయన తగిన న్యాయం చేస్తానన్నారు.
గతేడాది లబ్ధి పొందా
చమడబోయిన సుజాత బాధిత మహిళ
చేయూత పథకం ద్వారా గత ఏడాది లబ్ధిపొందా. రెండవ విడతలో లబ్ధిదారుల జాబితాలో పేరు లేదని తెలిసింది. గ్రామంలో మా సామాజిక వర్గానికి చెందిన మహిళలనే లక్ష్యంగా చేసుకొని కడుపు కొట్టారు. కొందరు వలంటీర్లు రాజకీయ నాయకులా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు కూడా వలంటీర్లకు వంత పాడుతున్నారు.
Updated Date - 2021-06-08T06:05:19+05:30 IST