ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే..
ABN, First Publish Date - 2021-09-29T06:40:22+05:30
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ వెంకటమురళి తెలిపారు.
వ్యవసాయ పరికరాల కొనుగోలుపై జేసీ స్పష్టం
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 28: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యవసాయ యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు అవసరమైన పరికరాల కొనుగోలు చేసేందుకు ఆ మేరకు ధరలను ఆమోదించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం జేసీ వెంకటమురళి అధ్యక్షతన సమావేశం జరిగింది. రైతుభరోసా కేంద్రాల్లోని సీహెచ్సీ గ్రూపు సభ్యులైన రైతుల కమిటీ ఆమోదించిన ధరల ప్రకారం యంత్రాలను కొనుగోలు చేయాలన్నారు. సాగుకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు అధికభారం పడకుండా జిల్లాస్థాయి కమిటీ సరసమైన ధరలను నిర్ణయించిందన్నారు. రైతుభరోసా కేంద్రానికి రూ.15లక్షల విలువ చేసే యూనిట్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యూనిట్ ధరలో 50శాతం ఆప్కాబ్ ద్వారా రుణం మంజూరుతోపాటు 40శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుందని, మిగిలిన పది శాతాన్ని లబ్ధిదారుని వాటాగా రైతులు తమ సంఘాల ద్వారా యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తాయని తెలిపారు. కమిటీ ఆమోదం మేరకు ఆయా కంపెనీల డీలర్లు తమ యంత్రాలు, పరికరాలను విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేడీఏ ఎస్.శ్రీనివాసరావు, ఆగ్రో మేనేజర్ నాగమురళి, ఏడీఏలు బాలాజీనాయక్, ఎం.శేషగిరి, టి.మోహన్రెడ్డి, ఏవో శ్రీనివాస్నాయక్, డీలర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-09-29T06:40:22+05:30 IST