మోపాడు వరదల ఘోరకలికి 25 సంవత్సరాలు
ABN, First Publish Date - 2021-10-18T06:22:41+05:30
మండలంలో 1996లో కురిసిన అతి భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్ నిండింది.
పామూరు, అక్టోబరు 17: మండలంలో 1996లో కురిసిన అతి భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్ నిండింది. అలుగుకట్టపై నుంచి 10 అడుగుల మేర వరదనీరు ప్రవహించింది. నాటి ఈ వరదల ఘటనలో సుమారు 179 మంది జలసమాది అయ్యారు. ఈ ఘటన జరిగి ఆక్టోబరు 18 నాటికి సరిగ్గా 25 సంవత్సరాలు పూరైంది. ఆనాటి ఘటనలో మోపాడు రిజర్వాయర్ కట్ట తెగిందని ఆందోళనలో ఉన్న గ్రామస్థులు అలుగు మీదుగా కొండకు చేరుకొని ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నారు. అదే ఆశతో జోరున కురిసే వర్షం, కారు చీకట్లను సైతం లెక్క చేయకుండా అలుగు దాటే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఉదృతిగా ఉన్న అలుగు 179 మందిని బలితీసుకుది. మోపాడు పంచాయతీ పరిధిలోని వాకంవారిపల్లి, కొత్తపల్లి, ఎస్టీ కాలనీకి చెందిన ప్రజలు ముంచుకొని వచ్చే వరద ప్రవాహానికి ప్రాణాలు కాపాడుకొనే ప్రయత్నంలో చిమ్మచీకట్లో నీటి ఉదృతిని అంచనా వేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆనాటి భయంకరమైన ఘటన నేటికి కళ్ళముందే కదిలాడుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. వరద ప్రవాహంతో అశువులు బాసిన మృతులకు శాంతి కలగాలని గ్రామస్థులు స్మరించుకుంటున్నారు.
Updated Date - 2021-10-18T06:22:41+05:30 IST