పట్టాభిని పోలీసులు తీవ్రంగా కొట్టారు
ABN, First Publish Date - 2021-10-29T09:03:50+05:30
పట్టాభిని పోలీసులు తీవ్రంగా కొట్టారు
నాకు సమాచారం ఉంది: రఘురామ
న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘కోర్టు నుంచి మచిలీపట్నం సబ్ జైలుకు తరలించే క్రమంలో టీడీపీ నేత పట్టాభిని పోలీసులు తీవ్రంగా కొట్టారు. నాకు సమాచారం ఉంది. ఇదిచాలా సిగ్గుమాలిన పని. ఈ మధ్య ఎవరు ఏం చెప్పినా నోటీసులు ఇవ్వడం పోలీసులకు అలవాటయింది. విజయవాడ సీపీ కానీ, కృష్ణా ఎస్పీ కానీ దీనిపై ఫోన్ చేస్తే చెపుతా. విజయసాయిరెడ్డీ... పట్టాభిని పోలీసులు కొట్టారా? లేదా!.. చెప్పాలి. రాష్ట్రంలో పోలీసులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. డీజీపీ మంచివారేనని, కానీ ఆయనకు పరిస్థితులు అనుకూలించడం లేదన్నారు. రాష్ట్రంలో అఖిల భారత సర్వీసు అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజూవారీ విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు ప్రకటించడం శుభపరిణామన్నారు. చంద్రబాబుకు అమిత్షా ఫోన్ చేయడంతో తమ పార్టీ నేతలు కలత చెందుతున్నారని, వారి ఆందోళన విజయసాయిరెడ్డి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ, బీజేపీ దగ్గర అవుతాయని తమ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అసభ్యకరమైన మాటలకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించారని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ చాలా మాట్లాడారని రఘురామ తెలిపారు.
Updated Date - 2021-10-29T09:03:50+05:30 IST