మళ్లీ నామినేషన్లకు ఓకే!
ABN, First Publish Date - 2021-03-02T09:20:18+05:30
మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని రాష్ట్ర
కారణాలను బట్టి అవకాశం ఎస్ఈసి
ఇప్పటికే సిమలో11 వార్డులకు మళ్లీ నామినేషన్లు
విశాఖపట్నం/అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల నామినేషన్ వేయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తెలిపారు. అయితే, ఆయా కారణాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని పోటీలో ఉన్న అభ్యర్థులకు సూచించారు. ఓటరు స్లిప్పులను ఈ నెల ఏడవ తేదీకల్లా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విశాఖలో నాలుగు జిల్లాల అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన సమీక్షించారు. గ్రామీణ ఓటర్ల కంటే పట్టణ, నగర ఓటర్లు విద్యావంతులని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదైందని, మునిసిపల్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ నమోదవుతుందని ఆశిస్తున్నామన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు ఒకే నిబంధనలు వర్తిస్తాయని, ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల విషయంలో చాలాచోట్ల రాత్రిపూట కరెంట్ తీసేసి ఫలితాలు తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయని వాటిపై పూర్తిస్థాయి నివేదిక కోరినట్టు తెలిపారు. అవి నిజమని తేలితే.. అధికారులను ఉపేక్షించేది లేదన్నారు.
సీమలోని 11 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు
గతేడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాయలసీమలో కొందరు అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వకపోవడమో లేదా నామినేషన్లు వేసిన వారితో బలవంతంగా ఉపసంహరింపజేయడమో జరిగినట్లు నిర్ధారణ అయిన 11 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు సమర్పించేందుకు ఎస్ఈసీ అవకాశం ఇచ్చింది. మరో మూడు వార్డులకు సంబంధించి అప్పట్లో నామినేషన్లు వేసి, ఆ తర్వాత ఒత్తిళ్ల కారణంగా వాటిని ఉపసంహరించుకున్న ముగ్గురి అభ్యర్థిత్వాలనూ ‘రివైవ్’ చేసి, వారు మళ్లీ పోటీలో ఉన్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఎస్ఈసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ మొత్తం 11 వార్డులూ రాయలసీమలోని తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్లల్లోనివే కావడం గమనార్హం.
Updated Date - 2021-03-02T09:20:18+05:30 IST