‘జాయింట్’ ఊడింది!
ABN, First Publish Date - 2021-08-27T08:27:47+05:30
పూర్తిగా ప్రభుత్వ పోర్టుగా తెరపైకి వచ్చి... ఆ తర్వాత ప్రభుత్వ వాటాలున్న పోర్టుగా మారి... ఇప్పుడు వందశాతం ప్రైవేటు చేతిలోకి వెళ్లడం! ..
ప్రైవేటు పోర్టుగా సాగేదెలా?
గంగవరంపై కొత్త సందేహాలు
రక్షణ పరంగా కీలకమైన ప్రదేశం
ప్రైవేటు పోర్టుపై నాడు నేవీ అభ్యంతరం
జాయింట్ వెంచర్ అన్నందుకే ఓకే
భూముల విలువే రూ.3,600 కోట్లు
కానీ.. 644 కోట్లకే రాష్ట్ర వాటా విక్రయ
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి):పూర్తిగా ప్రభుత్వ పోర్టుగా తెరపైకి వచ్చి... ఆ తర్వాత ప్రభుత్వ వాటాలున్న పోర్టుగా మారి... ఇప్పుడు వందశాతం ప్రైవేటు చేతిలోకి వెళ్లడం! ఇన్ని మలుపులు తిరిగిన ఓడరేవు బహుశా గంగవరం ఒక్కటే కావొచ్చు. విశాఖలో కీలకమైన గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలను అదానీ సంస్థకు విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే... ప్రభుత్వ వాటాలు లేకుండా ఈ ఓడరేవును నడపడం కుదురుతుందా అనే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. తూర్పుతీరంలో ఉన్న విశాఖ నగరం పరంగా అత్యంత కీలకమైనది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే. ఇరవయ్యేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గంగవరంలో పోర్టు ప్రతిపాదన తెచ్చినప్పుడు... తూర్పు నౌకాదళంతో పాటు, విశాఖపట్నం స్టీల్ప్లాంటు, విశాఖపట్నం పోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. పోర్టుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో నౌకలు రాకపోకలు సాగిస్తాయని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని కేంద్రానికి నివేదించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టుకు అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత... ఈ పోర్టును జాయింట్ వెంచర్ కింద ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన 10.4 శాతం వాటాను విక్రయించడంతో పోర్టు వంద శాతం అదానీ పరమైంది. ఇక ‘జాయింట్ వెంచర్’ లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ ఇకపై ఉండదు. ఈ నేపథ్యంలో గంగవరం పోర్టు డీల్పై నౌకాదళ స్పందన ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది.
భూముల విలువే రూ.3,600 కోట్లు
గంగవరం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా 1800 ఎకరాలు ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వ ధర ఎకరా కోటి రూపాయలు ఉండగా, ప్రైవేటుగా రెండు కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన భూముల విలువే రూ.3,600 కోట్లు. కానీ... ఏపీ సర్కారు తన వాటాను అదానీకి కేవలం రూ.644 కోట్లకు కట్టబెట్టేసింది. మరోవైపు... గంగవరం వ్యూహాత్మక పోర్టు. ప్రతి ఏటా భారీ లాభాలు గడిస్తోంది. రూ.500 కోట్ల నగదు నిల్వలు కూడా ఉన్నాయి. ఇన్ని సానుకూలతలు ఉన్న పోర్టులో వాటాలు వదులుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు.
డబ్బులిస్తారా... షేర్లేనా?
గంగవరం పోర్టులో వాటాలు అమ్మిన వాళ్లకు అదానీ కంపెనీ నగదు చెల్లించిన దాఖలాలు లేవని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అత్యధిక వాటాలు విక్రయించిన డీవీఎస్ రాజు కుటుంబానికి కూడా నగదుకు బదులుగా అదానీ పోర్ట్సు ప్రత్యేక ఆర్థిక మండలి (ఏసీఎ్సఈజెడ్)లో వాటాలు ఇస్తామని ప్రతిపాదించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వాటా 10.4 శాతానికి రూ.644.78 కోట్లు చెల్లిస్తున్నామని అదానీ ప్రకటించింది. దీనికి కూడా వాటాలు ఇస్తున్నారా? నగదు చెల్లిస్తారా? అనేది తెలియదు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటనా రాలేదు.
దేశ భద్రతకు ముప్పు..
‘‘గంగవరం పోర్టును పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం వల్ల దేశ భద్రతకే ముప్పు ఏర్పడుతుంది. తీరప్రాంత రక్షణలో పోర్టుల పాత్ర చాలా కీలకం. ప్రభుత్వం దానిని విస్మరించింది. గంగవరం పోర్టులో వాటా విక్రయం వల్ల అటు విశాఖ స్టీల్ప్లాంటు కూడా నష్టపోతుంది. ఇప్పటికే గంగవరం పోర్టు సున్నపురాయి దిగుమతి ధరను ఏకపక్షంగా పెంచేసింది. త్వరలో రవాణా చార్జీలూ పెంచేస్తుంది. దానివల్ల దిగుమతి సరకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది.
- సీహెచ్ నరసింగరావు,
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
Updated Date - 2021-08-27T08:27:47+05:30 IST