‘ఎయిడెడ్’ ఎత్తివేస్తే ఊరుకోం!
ABN, First Publish Date - 2021-10-30T04:56:08+05:30
ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ విద్యాసంస్థలను ఎత్తివేస్తే ఊరుకోమని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ ఏకపక్ష జీవోలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నెల్లూరులో రాస్తారోకో నిర్వహించారు.
ప్రభుత్వ ఏకపక్ష జీవోలను రద్దు చేయాలి
ఎస్ఎఫ్ఐ రాస్తారోకో
విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
నెల్లూరు (విద్య), అక్టోబరు 29 : ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వీర్యమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ విద్యాసంస్థలను ఎత్తివేస్తే ఊరుకోమని ఎస్ఎఫ్ఐ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ ఏకపక్ష జీవోలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నెల్లూరులో రాస్తారోకో నిర్వహించారు. వీఆర్ హైస్కూల్ విద్యార్థులు తమ పాఠశాలను కొనసాగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నేతలతో కలసి రాస్తారాకోకు బయలుదేరారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఎస్ఎఫ్ఐ నేతలతో పాటు విద్యార్థులు ఎదురు తిరగడంతో కొంతసేపు తోపులాట జరిగింది. విద్యార్థులు వీఆర్సీ కూడలికి చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా దాదాపు గంటసేపు నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పీ శ్రీనివాసులు మాట్లాడుతూ సామాన్య కుటుంబాలకు విద్యను దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా తీసుకువచ్చిన 42, 50 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రసిద్ధ వీఆర్ విద్యాసంస్థల పాలనను పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి ఎవరితో సంప్రదించ కుండా సంస్థలను మూసివేశారని ఆరోపించారు. ఇప్పటికీ కళాశాలలో 300 మందికి పైగా, పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, వారి భవితను ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శించారు. జిల్లాలో మొత్తం 28 ఎయిడెడ్ కళాశాలలను మూసేయాలనే ప్రభుత్వ కుట్రను అందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి సంఘాలు ఏకతాటిపై నిలబడి విద్యాసంస్థలను పరిరక్షించుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సనత్, నాయకులు తేజ, చిన్ని, చంద్ర, సిసింద్రీ, సంతోష్, నవీన్, గణేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:56:08+05:30 IST