‘ప్రైవేటు’లో ఫీజు దాహం !!
ABN, First Publish Date - 2021-01-21T04:45:16+05:30
జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు సెమిస్టర్ ఫీజుల విషయంలో విద్యార్థులను దోచుకుంటున్నాయి.
డిగ్రీ పరీక్ష ఫీజుల్లో విద్యా సంస్థల దోపిడీ
నిర్దేశిత ఫీజు కంటే అదనంగా కట్టాలంటూ ఒత్తిడి
వీఎస్యూ రిజిస్ట్రార్కు విద్యార్థుల ఫిర్యాదు
అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు : రిజిస్ట్రార్
నెల్లూరు(స్టోన్హౌస్పేట), జనవరి 20: జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు సెమిస్టర్ ఫీజుల విషయంలో విద్యార్థులను దోచుకుంటున్నాయి. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే అందతే అని సమాధానమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక ఫీజుల విషయమై పలువురు విద్యార్థులు వర్సిటీ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశం అయింది. కాగా, ఫీజు చెల్లింపునకు మరి కొద్దిరోజులే ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
వీఎస్యూ పరిఽధిలోని డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 15 వేల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. వర్సిటీ ఉత్తర్వుల మేరకు ఒక్కో సెమిస్టర్కు రూ.700 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ప్రైవేటు కళాశాలల యాజమాన్యం మాత్రం రూ.1700 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు కళాశాల ప్రతినిధుల ఫోన్ సంభాషణను విద్యార్థులు రికార్డ్ చేసి వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు.
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు
వీఎస్యూ విడుదల చేసిన జీవో ప్రకారమే పరీక్ష ఫీజులు చెల్లించాలి. విద్యార్థులకు పలు రకాల ఫీజులను పరీక్ష ఫీజులతో ముడిపెట్టి బలవంతంగా వసూలు చేయాలనుకునే కళాశాలలపై చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు తెలియజేశాము.
- డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, రిజిస్ట్రార్, వీఎస్యూ
Updated Date - 2021-01-21T04:45:16+05:30 IST