యువకుడి దారుణహత్య.. పోలీసుల అదుపులో అత్తాకోడళ్లు ?
ABN, First Publish Date - 2021-09-15T04:57:15+05:30
మండలంలోని..
ముత్యాలపాడులో ఘటన
చిల్లకూరు, సెప్టెంబరు 14: మండలంలోని ముత్యాలపాడు అరుంధతీయవాడలో ఒక యువకుడు మంగళవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యాడు. గ్రామస్థుల కథనం మేరకు కోట మండలం తిన్నెలపూడి పంచాయతీలోని లక్ష్మక్క కండ్రిగలోని పడమటి అరుంధతీయవాడకు చెందిన కాకు దయాకర్ (28) చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో జులాయిగా మారాడు. పదేళ్ల క్రితమే దయాకర్, తన అన్నతో కలిసి ఇంటి నుంచి వచ్చేశారు. అన్న నెల్లూరులో కూలి పనులు చేసుకుని బతుకుతున్నాడు.
దయాకర్ హైదరాబాదులో మోటారుబైక్ మెకానిక్గా ఉంటూ పలు వ్యసనాలకు లోనయ్యాడు. జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదై ఉన్నాయి. 6 నెలల క్రితం దయాకర్ తన అన్న వద్దకు వచ్చి మెకానిక్గా ఉంటున్న క్రమంలో వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కూడా కేసు నమోదై ఉంది. ఇటీవలే దయాకర్ చిల్లకూరు మండలం ముత్యాలపాడు వచ్చి సమీప బంధువుల ఇంట్లోనే ఉంటున్నాడు. పగలంతా గూడూరు గాంధీనగర్లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగేవాడనీ, వారానికి మూడునాలుగు సార్లు స్నేహితులు ముత్యాలపాడు అరుంధతీయవాడకు వచ్చి మద్యం తాగే వారనీ తెలిసింది. సోమవారం రాత్రి మిద్దెపైన ఇంట్లో దయాకర్ ఒక్కడే నిద్రిస్తున్నాడు. తెల్లవారుజామున కేకలు వినిపించడంతో మిద్దెకింద నిద్రిస్తున్న అతని సమీప బంధువులైన అత్తా కోడళ్లు స్థానికులను వెంటబెట్టుకుని మిద్దెపైకి వెళ్లి చూడగా దయాకర్ రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉన్నాడు.
లక్ష్మక్కకండ్రిగలో బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు రాత్రికిరాత్రే దయాకర్ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, సీఐలు శ్రీనివాసులురెడ్డి, హరికృష్ణ, ఎస్ఐలు సుధాకర్రెడ్డి, పుల్లారావు లక్ష్మక్కకండ్రిగ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఛాతీ, గొంతుకింద బలమైన గాయాలు ఉండడంతో పదునైన ఆయుధంతో కొట్టి హత్యచేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లోని అత్తకోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అంతేగాక పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2021-09-15T04:57:15+05:30 IST