ప్రజలను అప్రమత్తం చేయండి
ABN, First Publish Date - 2021-04-24T05:03:29+05:30
నెల్లూరు నగరంలో కరోనా వైరస్ విస్తరణ వేగంగా ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.
కేసులున్న చోట శానిటైజేషన్ తప్పనిసరి
కార్పొరేషన్ అధికారులకు మంత్రి అనిల్ ఆదేశం
నెల్లూరు (సిటీ), ఏప్రిల్ 23 : నెల్లూరు నగరంలో కరోనా వైరస్ విస్తరణ వేగంగా ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కే దినేష్కుమార్తో కలిసి ఆయన అధికారులతో సమావేశం ని ర్వహించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను వెంటనే శుభ్రపరచాలని, బ్లీచింగ్ చల్లి శానిటైజ్ చేయాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే అన్ని రకాల చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. పారిశుధ్య కార్మికుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.
కరోనా పడకలు పెంచాలి
సీపీఎం నగర కార్యదర్శి రమేష్
నెల్లూరు (వైద్యం), ఏప్రిల్ 23 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప థ్యంలో కరోనా బాధితులకు అవసరమైన పడకలు పెంచాలని సీపీఎం నగర కార్యదర్శి మూలం రమేష్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన క్రమంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. వైరస్ సెకండ్వేవ్ ఆందోళనకు గురిచేస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పడకలతో పాటు అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రత్యేకించి కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలన్నారు. బ్లాక్ మార్కెట్లో మందుల అమ్మకంపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తి శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకపోతే మార్కెట్ మూసేయాల్సి వస్తుంది
ఏఎంసీ చైర్మన్ ఏసయ్య
నెల్లూరు(వ్యవసాయం), ఏప్రిల్ 23 : కొవిడ్ నియంత్రణలో భాగంగా కూరగాయల మార్కెట్లోని వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే మార్కెట్ను మూసేసే పరిస్థితి వస్తుందని నెల్లూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎంబేటి ఏసయ్య పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో శుక్రవారం మార్కెట్ సమావే శమయ్యారు. ప్రతి వ్యాపారీ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. దుకాణాలు దూర దూరంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొనుగోలుదారులు ఇబ్బంది పడకుండా, ఒకరినొకరు తోసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. అంతకుముందు ఆయన మార్కెట్ను పరిశీలించారు. లోపలికి వాహనాలు రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ రామమ్మ, మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీలు
మెరుగైన సేవలు అందించాలంటూ ఆదేశం
నెల్లూరు(వైద్యం), ఏప్రిల్ 23 : జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాలను, భోజనాన్ని పరిశీలించారు. కొంతమంది కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో వైద్య సేవలు అందించాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జొన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-24T05:03:29+05:30 IST