ధాన్యం కొనుగోలులో దగా!
ABN, First Publish Date - 2021-04-24T03:19:35+05:30
మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు ఆడిందే ఆటగా మారిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూకాల్లో కోత
ఆలస్యంగా చెక్లిస్టు అందజేత
నష్టపోతామంటున్న రైతులు
చిట్టమూరు, ఏప్రిల్ 23: మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాల్సిన అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో మిల్లర్లు ఆడిందే ఆటగా మారిందని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టివానిపల్లికి చెందిన మర్రి కోటేశ్వరమ్మ, పిట్టి రవికుమార్ ఎన్ఎల్ఆర్ 34449 రకం ధాన్యాన్ని చిట్టమూరు సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. మార్చి 19న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం అధికారులు కేటాయించిన కోట మండలం వెంకన్నపాలెం కేంద్రంలోని ధనలక్ష్మి రైస్మిల్లుకు పంపారు. బస్తాకు 40 కిలోల చొప్పున తాము మిల్లుకు తరలించగా, బస్తాకు రెండు కిలోల చొప్పున కోత కోస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తాము అంగీకరించకపోగా, తమ ధాన్యాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, ఏప్రిల్ 3న ధాన్యం దించుకున్నట్టుగా రైతులకు చెక్లిస్టు ఇచ్చారు. ఈ తేదీన చెక్లిస్టు ఇస్తే రబీసీజన్లో అమ్మకుండా తాము ఖరీఫ్సీజన్లో ధాన్యం అమ్మినట్టు నమోదవుతుందని, దీంతో ఆరు నెలల తర్వాతే తమకు ధాన్యానికి సంబంధించిన నగదు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సొసైటీ అధికారులకు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయిందని, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Updated Date - 2021-04-24T03:19:35+05:30 IST