సచివాలయం మహిళా పోలీసు ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-12-03T03:35:18+05:30
సీతారామపురం బిట్-2 సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శ్రీవిద్య(30) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
సీతారామపురం, డిసెంబరు 2: సీతారామపురం బిట్-2 సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి శ్రీవిద్య(30) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన ఈమెకు మూడు నెలల క్రితం వింజమూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో కుటుంబ సభ్యులు వివాహం చేశారు. అప్పటి నుంచి సీతారామపురంలో విధులు నిర్వర్తిస్తూ వింజమూరుకి రాకపోకలు సాగించేది. అయితే గురువారం సచివాలయంలో విధులు ముగించుకుని తల్లిదండ్రుల స్వగ్రామమైన అయ్యవారిపల్లికి వెళ్లిన శ్రీవిద్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తరువాత ఇంటికి వచ్చిన సోదరుడు ఎంతసేపు తలుపుకొట్టినా తీయ్యకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి ఉరికి వేలాడుతున్న ఆమెను కిందికి దించి చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబకలహాల కారణంగానే ఈ అఘూయిత్యానికి పాల్పడి ఉంటుందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. శ్రీవిద్య మృతికి ఎంపీడీవో ఐజాక్ప్రవీణ్, సచివాలయ సిబ్బంది తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Updated Date - 2021-12-03T03:35:18+05:30 IST