‘అవమానం’పై గుర్రు
ABN, First Publish Date - 2021-05-15T09:49:18+05:30
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తీరుపై తూర్పుగోదావరిజిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు గుర్రుగా ఉన్నారు. తమను అవమానపరిచేలా ఆయన..
కాటమనేని భాస్కర్ తీరుపై ’తూర్పు’ వైద్యాధికారులు ఫైర్
భేటీలో అమమానపరిచేలా మాట్లాడారని తీవ్ర మనస్తాపం
పనిచేయకుండా కాలక్షేపం చేస్తూ జీతం తీసుకుంటున్నామా?
కొవిడ్ కేసులకు, మరణాలకు మేమే కారణమంటారా?
ప్రాణాలకు తెగించి కొవిడ్ రోగులకు సేవలందిస్తున్నాం
మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్లు ఇవ్వకున్నా విధులు
అలాంటి మాపైనే క్రమశిక్షలు తీసుకొంటానంటారా?
రహస్యంగా జూమ్ యాప్లో అసోసియేషన్ ఆగ్రహం
సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయం
సీఎం దృష్టికీ తీసుకువెళ్లే యోచనలో వైద్యాధికారులు
కాకినాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తీరుపై తూర్పుగోదావరిజిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలు గుర్రుగా ఉన్నారు. తమను అవమానపరిచేలా ఆయన మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ ముప్పు ఉన్నా అనేక అసౌకర్యాల మధ్య పనిచేస్తుంటే.. అసలేం పనిచేయడం లేదన్నట్టు కించపరచడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ భాస్కర్ మాట తీరు, వ్యవహారంపై ప్రభుత్వం దృష్టికి తమ ఆవేదన తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జిల్లా వైద్యాధికారుల సంఘం కీలక నాయకులు జూమ్ యాప్లో అంతర్గతంగా సమీక్షించారు. కమిషనర్ తీరుపైనా, తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ సహా ఇతర ఐఏఎస్ అధికారుల తీరుపైనా చాలాసేపు చర్చించుకున్నారు. కొవిడ్ విపత్తులో రేయింబవళ్లు పనిచేస్తుంటే కొందరు ఐఏఎ్సలు తమను హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్.. తూర్పుగోదావరి జిల్లా వైద్యాధికారులు, ఏఎన్ఎంలతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్ను ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కొవిడ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున తీసుకోవాల్సిన మరిన్ని చర్యలను సమీక్షించేందుకు కాటమనేని భాస్కర్..ఈ సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఆయన తమను పరుష పదజాలంతో నిందించారని వైద్యులు, ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అనేక మంది వైద్య సిబ్బంది అసలు పనిచేయకుండా కాలక్షేపం చేస్తూ జీతాలు తీసుకుంటున్నారని, వీరి పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే జరిపి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారని పేర్కొంటూ.. తమకు జరిగిన అవమానంపై సుదీర్ఘంగా జిల్లా వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది పేరుతో శుక్రవారం రాత్రి వారి సోషల్ మీడియా గ్రూపులో ఆవేదన వెళ్లగక్కుతూ అభ్యంతరాలను వెల్లడించారు.
కొవిడ్ మరణాలకు, కేసులకు తామే కారణమని కమిషనర్ మాట్లాడడం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి విపత్తులో మాస్కులు, గ్లౌజ్లు లేకుండా కష్టపడి పనిచేస్తుంటే ఇలా నిందలు వేయడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కొవిడ్ టెస్ట్లు చేస్తున్నా నాలుగు రోజుల వరకు ఫలితాలు వచ్చేలా సదుపాయాలు లేవని, దీనివలన పెరుగుతున్న కేసుల బాధ్యత తమది ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రైవేటుగా టెస్ట్లు చేయించుకుని పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉండకుండా బయట తిరిగేస్తూ కొవిడ్ వ్యాప్తికి కారణం అవుతుంటే దానికి తాము బాఽధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. హోం ఐసొలేషన్లో ఉంటున్న వారి వద్దకు వెళ్లడానికి మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్లు ఇవ్వడం లేదని... అయినా ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటే నిందలేంటని ప్రశ్నించారు. ప్రతిరోజూ టెస్ట్లు, వ్యాక్సినేషన్లకు టార్గెట్లు ఇస్తూ అవి పూర్తి చేయడం కోసం ఇతర శాఖల అధికారులతో తమపై సమీక్షలు చేయిస్తుండటం అవమానించడం కాదా? అని నిలదీశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేస్తుంటే సర్వర్లు పనిచేయడం లేదని.. తమకు లక్ష్యాలు నిర్దేశించే ఉన్నతాధికారులు దీనికి బాధ్యత తీసుకొంటారా అని ప్రశ్నించారు. ఇలా అనేక అంశాలపై కమిషనర్ తీరును నిలదీశారు. ఆయన మాట తీరు అందరినీ బాధిస్తోందని, అంతటి అహంకారపూరిత మాటలను భరించలేమనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వ్యవహారాన్ని సీఎం, ఇతర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా వైద్యాధికారుల అసోసియేషన్ తీర్మానించింది. ఈ మేరకు అసోసియేషన్లోని కీలక వైద్యులు శుక్రవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడి చర్చించుకున్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని తీర్మానించారు. ఐదు రోజుల పాటు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. ఈలోగా ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టాలని, లేకపోతే తదుపరి కార్యాచరణ జేఏసీగా ఏర్పడి చేపట్టాలని ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు.
Updated Date - 2021-05-15T09:49:18+05:30 IST