పంటల ధరలు తగ్గకుండా చర్యలు: కన్నబాబు
ABN, First Publish Date - 2021-05-07T09:37:15+05:30
కొవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం రాకూడదని సీఎం ఆదేశించారని, పంటలకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్, కర్ఫ్యూ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం రాకూడదని సీఎం ఆదేశించారని, పంటలకు ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. టమాట ధరలు తగ్గకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ నేపథ్యంలో పరిస్థితులు మారుతున్నాయని, ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం జారీ చేసే పాసులు పోలీసులు కచ్చితంగా అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కలెక్టర్తో పాటు ఎస్పీలకు విధి విధానాలు పంపాలని, కింది స్థాయి పోలీసు అధికారులకు చేరడం ద్వారా ఎవరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదన్నారు. గుంటూరు, పలమనేరు, మదనపల్లె లాంటి పెద్ద మార్కెట్లలో ప్రత్యేక విధి విధానాలు ఖరారు చేయాలని మంత్రి సూచించారు. వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, రసాయనాల దుకాణాలను సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Updated Date - 2021-05-07T09:37:15+05:30 IST