వివాహిత ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-10-29T09:02:07+05:30
వివాహిత ఆత్మహత్యాయత్నం
పోలీస్ కమిషనరేట్ ఎదుటే ఘటన
విజయవాడ(వన్టౌన్), అక్టోబరు 28 : ఓ వ్యక్తి తన ఫొటోలను.. నగ్నచిత్రాలతో మార్ఫింగ్ చేసి వేధిస్తున్న వైనంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన ఓ వివాహిత పోలీసు కమిషనరేట్ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్న మహిళా కానిస్టేబుళ్లు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెవద్ద సీఎం పేరిట ఉన్న ఓ లేఖ లభ్యమైంది. దీని ప్రకారం.. ఐదేళ్ల క్రితం తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సులేమాన్తో విజయవాడకు చెందిన యువతికి సోషల్మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించడంతో రెండేళ్ల నుంచి అతడు ముఖం చాటేశాడు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆమెకు వేరొకరితో వివాహమైంది. ఇది తెలుసుకున్న సులేమాన్ ఆమె ఫొటోలను.. మార్ఫింగ్ చేసి ఆమె బంధువులకు, పెళ్లికుమారుడికీ పంపించి వేధిస్తున్నాడు. దీనిపై ఆమె పెనమలూరు పోలీసులకు గతనెల 21న ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ‘స్పందన’లో డీసీపీని కలిసి ఫిర్యాదు చేసింది. భర్త ఆమెను పుట్టింట్లో వదిలేసి, ఇవన్నీ పరిష్కారమయ్యాకే తీసుకువెళతానని చెప్పాడు. దీంతో ఆమె పోలీసు కమిషనర్ను కలుద్దామని గురువారం ప్రయత్నించినా వీలుకాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వివరించింది.
Updated Date - 2021-10-29T09:02:07+05:30 IST