మద్దతు లేని మొక్కజొన్న
ABN, First Publish Date - 2021-11-11T05:18:36+05:30
రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కరువైంది.
- పెరిగిన పెట్టుబడులు
- కల్లాల్లోనే మగ్గుతున్న ధాన్యం
- ఆందోళనలో రైతులు
ఓర్వకల్లు, నవంబరు 10: రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కరువైంది. మొక్కజొన్నలకు మద్దతు ధర లేక కల్లాల్లోనే మగ్గుతున్నాయి. గత ఏడాది మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచర్ల, నన్నూరు, లొద్దిపల్లె, ఉయ్యలవాడ, ఉప్పలపాడు, ఎన్.కొంతలపాడు, గుట్టపాడు, హుసేనాపురం, సోమయాజులపల్లె, శకునాల, కొమరోలు తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంట దాదాపు 3వేల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వర్షాలు రాకపోవడంతో 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అయితే ఎకరాకు పంటపై పెట్టుబడి రూ.10వేలు వచ్చిందని రైతులు తెలిపారు. క్వింటం మార్కెట్లో రూ.1180 ఉండగా.. వ్యాపారులు మాత్రం రూ.1550లకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటం రూ.2,500 ధర ప్రకటిస్తే తమకు గిట్టుబాటు ఉంటుందన్నారు.
రైతులను ఆదుకోవాలి
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలి. సా గు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈఏడాది రైతులు అప్పుల వలయంలో కూరుకపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
- రామకోటేశ్వరరావు, రైతు
ఆత్మహత్యలే శరణం
మొక్కజొన్నలో ఆశించినంత దిగుబడి రాలేదు. ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించక పోతే రైతులకు ఆత్మహత్యే శరణ్యం.
- గోవిందరెడ్డి, రైతు
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
గత మూడేళ్లుగా పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటం రూ.2,500 కొనాలి. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
- మోహన్ రెడ్డి, రైతు
Updated Date - 2021-11-11T05:18:36+05:30 IST