థ్యాంక్యూ డాక్టర్
ABN, First Publish Date - 2021-07-01T06:16:28+05:30
పోయే ప్రాణాన్ని నిలిపే శక్తి వైద్యుల సొంతం. అనారోగ్యంతో బాధపడేవారు వైద్యుల చెంతకు చేరగానే సగం ఊరట చెందుతారు.
- రోగుల పాలిట దేవుళ్లు
- ప్రాణాలొడ్డి.. కొవిడ్ బాధితులకు సేవ
- జీజీహెచ్లో కార్పొరేట్ స్థాయి వైద్యం
- నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
కర్నూలు(హాస్పిటల్), జూన్ 30: పోయే ప్రాణాన్ని నిలిపే శక్తి వైద్యుల సొంతం. అనారోగ్యంతో బాధపడేవారు వైద్యుల చెంతకు చేరగానే సగం ఊరట చెందుతారు. నాడి చూసి, ‘ఏం పరవాలేదు.. ఈ మందులు వాడు..’ అని చెప్పగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అప్పటిదాకా ముక్కుతూ, మూలుగుతూ ఆస్పత్రికి వెళ్లినవారు ప్రశాంతంగా వెనుదిరుగుతారు. వైద్యులు ఇచ్చే మందులు, అంతకు మించి వారి నోట వచ్చే మంత్రం లాంటి మాటలు రోగాలను ఇట్టే నయం చేస్తాయి. అందుకే వైద్యులను ఇలలో దేవతలుగా భావిస్తారు. ‘వైద్యో నారాయణో హరిః’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము’ అని సుమతీ శతక కర్త సూచించారు. ఈ సేవలు అందుబాటులో లేని ఊరులో ఉండనే వద్దు అని సుస్పష్టంగా ఏనాడో చెప్పేశారు. అలాంటి వైద్యులకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఎలా రుణం తీర్చుకోగలం.
డాక్టర్స్ డే నేపథ్యం
ప్రఖ్యాత వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్ పుట్టిన రోజును జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. బీసీ రాయ్ 1882 జూలై 1న జన్మించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో వైద్య విద్య, లండన్లో ఉన్నత విద్య అభ్యసించాక.. 1911లో స్వదేశానికి వచ్చి వైద్యసేవలు ప్రారంభించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేశారు. మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1961లో భారతరత్నతో సత్కరించింది. వైద్యవృత్తిలో విశేష సేవలు అందించిన ఆయన 1962 జూలై 1న కన్నుమూశారు. ప్రభుత్వం ఆయన జయంతి, వర్ధంతి రోజైన జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తోంది.
వెలకట్టలేని సేవ
కొన్ని శతాబ్దాల క్రితమే వైద్య సేవల ప్రాముఖ్యతను ఈ దేశం గుర్తించింది. ఆధునిక కాలంలో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. వైద్యమే లేని కొవిడ్ విపత్తు వచ్చినా.. లక్షణాలను బట్టి ఔషధాలను ఇస్తూ కొన్ని కోట్ల మంది ప్రాణాలను నిలుపుతున్నారు. బాధితుల ప్రాణాలకు తమ ప్రాణాలను ఒడ్డుతున్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రులు ముందుంటున్నాయి. ఫస్ట్ వేవ్ కన్నా రెండో వేవ్లో ప్రభుత్వ వైద్యులు అధిక శాతం బాధితులకు వైద్యులు మెరుగైన చికిత్సలు అందించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏకంగా 14,500 మంది బాధితులకు సేవలు అందించారు. ఈ క్రమంలో వైరస్ బారిన పడిన ప్రభుత్వ వైద్యులు, చికిత్స అనంతరం కోలుకుని తిరిగి విధుల్లో పాల్గొంటున్నారు. అలాంటి మహనీయుల సేవలను స్మరించుకునేందుకు ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కర్నూలు సర్వజన వైద్యశాలకు చెందిన కొందరు వైద్యుల అభిప్రాయంతో కథనం.
14,500 మందికి చికిత్స
కంటికి కనిపించని శత్రువు అయిన కరోనాను కట్టడి చేసే విషయంలో వైద్యులు విశేషంగా సేవలందిస్తున్నారు. గత 15 నెలల్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఫస్ట్, సెకండ్ వేవ్ల్లో 14,500 మంది కొవిడ్ బాధితులకు చికిత్స చేశారు. వీరిలో 11,926 మంది కోలుకున్నారు. కొవిడ్ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేయని విధంగా పాజిటివ్ బాధితులకు ఆపరేషన్లు, కాన్పులు, డయాలసిస్ సేవలు అందించాం. 240 మంది రెగ్యులర్ వైద్యులు, 350 మంది పీజీలు, 250 మంది హౌస్ సర్జన్లు, జీడీఎం 87 మంది వైద్యులు కొవిడ్ సమయంలో సేవలు అందించారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉన్నాం.
- డా.జి.నరేంద్రనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్
గుండెకు భరోసా.. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గుండె శస్త్ర చికిత్సలకు చిరునామాగా మారారు. జీజీహెచ్లో 400 పైగా గుండె ఆపరేషన్లు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో రాష్ట్ర క్రిటికల్ కేర్ సలహాదారుగా నియమించింది. ఆ తర్వాత కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూం (విజయవాడ) స్పెషల్ ఆఫీసర్గా నియమించింది. కొవిడ్ నియంత్రణకు విశేషంగా కృషి చేసిన ఆయన, అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ పెంచడం, ఆక్సిజన్ లైన్లు వేయడం, ట్యామర్లు, సిలిండర్లు ఏర్పాటు చేయించడంలో ప్రముఖ పాత్ర వహించారు. మొదటి స్టేజీలో సీటీ స్కాన్ అవసరం లేవని, కొవిడ్ వచ్చినా భయపడకుండా గృహ వైద్యం చేసుకోవాలని సూచించి, బాధితుల్లో ధైర్యం నింపారు. రూ.300కే కరోనా వైద్యం అని విస్తృత ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా రాయలసీమ మాండలికంలో కథలు, కథనాలు, కవితలు రాస్తూ వైద్యం గురించి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. తన అనుభవాలను పాఠాలుగా రాస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ రికవరీలు సంతృప్తినిచ్చాయి..
ప్రాణాపాయ స్థితిలో కర్నూలు జీజీహెచ్కు వచ్చిన బ్లాక్ ఫంగస్ బాధితులు నా వైద్యంతో కోలుకోవడం ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఇప్పటి వరకు 230 బ్లాక్ ఫంగస్ కేసులు వచ్చాయి. ఇందులో 110 మందికి బ్లాక్ ఫంగస్ శస్త్ర చికిత్సలు నిర్వహించాము. 98 మంది డిశ్చార్జ్ అయ్యారు. 101 మంది చికిత్స పొందుతున్నారు. డీఎంఈ, కలెక్టర్ మంజూరు చేసిన పరికరాలతో, సూపరింటెండెంట్, ఈఎన్టీ, హెచ్వోడీల సహకారంతో బ్లాక్ ఫంగస్ బాధితులకు రాయలసీమలోనే అత్యధిక శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించాం. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్లాక్ ఫంగస్ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాము. బ్లాక్ ఫంగస్ బాధితులు కోలుకునేలా చేయడం, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందించడం నమ్ముకున్న వృత్తికి న్యాయం చేస్తున్నామన్న సంతృప్తిని ఇస్తున్నాయి.
- డా.శివప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్టీ విభాగం,కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
కుటుంబానికి దూరంగా..
2020 మార్చి 28న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి కొవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి 15 నెలలుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో తాను ఉంటూ, కుటుంబ సభ్యులను మొదటి ఫ్లోర్లో ఉంచారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వైద్య సేవలు అందించి ప్రశంసలు పొందారు. డోన్కు చెందిన ఓ కొవిడ్ బాధితుడి పరిస్థితి విషమంగా మారితే, అతనికి వెంటిలేటర్పై చికిత్స అందించి కోలుకునేలా చేశారు. ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని డా.రవికళాధర్ రెడ్డి చెబుతున్నారు. కలెక్టర్తో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు, పోలీసులు అధికారులు, వీఐపీలకు చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కీర్తిని ఇనుమడింపజేశారు. మే 25న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమయంలో డా.రవికళాధర్ రెడ్డి సీఎంతో మాట్లాడారు. కర్నూలు జీజీహెచ్లో కొవిడ్ చికిత్సకు ఇన్చార్జిగా ఉన్నానని, కొవిడ్ సమయంలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నామని సీఎంకు వివరించారు. రోజుకు 1000 మంది సాధారణ రోగులు, 300 మంది గర్భిణులు, 200 మంది డయాలసిస్ రోగులకు కొవిడ్ చికిత్సలు అందిస్తున్నామని తెలియజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు.
సవాల్తో కూడుకున్న విధులు
15 నెలల కరోనా కాలం సవాల్తో కూడుకున్న విధులు నిర్వహించాం. చాలా మంది కొవిడ్ బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల్లో వచ్చారు. వారికి జీజీహెచ్ వైద్యులు విశేష సేవలు అందించారు. కడప జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఓ యువకుడు కరోనా పాజిటివ్తో లంగ్స్ దెబ్బతిని చికిత్స కోసం హైదరాబాదుకు వెళ్లాడు. అక్కడ బెడ్ దొరకక కర్నూలు జీజీహెచ్లో చేరడంతో చికిత్స అందించాము. దాదాపు రెండు వారాలు సీ-ప్యాప్ మీద ఉంచి, ఆ తర్వాత పది రోజులు ఆక్సిజన్ అందించాము. నెల రోజుల తర్వాత కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం ఎంతో సంతృప్తినిచ్చింది. జమ్మలమడుగుకు చెందిన 50 ఏళ్ల ఓ వ్యక్తి కూడా హైదరాబాదులో బెడ్ దొరకక కర్నూలు జీజీహెచ్లోనే చేరడంతో చికిత్స అందించాము. మూడు వారాల్లో కోలుకున్నారు. ఈ ఇద్దరు బాధితులు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషాన్నిచ్చింది. పీక్ స్టేజ్లో రాత్రిపూట ఒంటి గంట వరకు విధులు నిర్వహించాము. కొవిడ్ బాధితులకు మెరుగైన సేవలను అందించాము. విపత్కర పరిస్థితుల్లో సమష్టి కృషితో సమర్థవంతంగా సేవలు అందించగలుగుతున్నాం.
- డా.బి.హేమనళిని, సీఎస్ఆర్ఎంవో, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
Updated Date - 2021-07-01T06:16:28+05:30 IST