‘జనాగ్రహ దీక్షలు ఎందుకు?’
ABN, First Publish Date - 2021-10-24T05:06:49+05:30
వైసీపీ నాయకులు చేపట్టిన జనాగ్రహ దీక్షలు ఎవరి కోసం చేశారో.. ఎందు కోసం చేశారో ప్రజలకు ఏ మాత్రం అర్థం కాలేదని.. వారి తపనంతా ముఖ్యమంత్రి జగన్కు భజన చేయడం కోసమేనని ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 23: వైసీపీ నాయకులు చేపట్టిన జనాగ్రహ దీక్షలు ఎవరి కోసం చేశారో.. ఎందు కోసం చేశారో ప్రజలకు ఏ మాత్రం అర్థం కాలేదని.. వారి తపనంతా ముఖ్యమంత్రి జగన్కు భజన చేయడం కోసమేనని ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ కర్నూలు లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శనివారం కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకుల జనాగ్రహ దీక్షలకు జనమే లేరని, కేవలం అరగంట సేపు ఆ నాయకులు పిచ్చాపాటి మాట్లాడుకుని చేతులు దులుపుకొన్నారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పాలనలో జగన్ సాధించింది శూన్యమని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించేందుకు 356 సెక్షన్ను వినియోగించి రాష్ట్రపతి పాలనను విధించేందుకు డిమాండ్ చేసేందుకే ఢిల్లీకి వెళుతున్నారని, దీంతో వైసీపీ నాయకులు కలవరపాటుకు గురవుతున్నారని అన్నారు. పాలన ఇలాగే సాగితే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అసభ్యంగా మాట్లాడారని పట్టాభిని అరెస్టు చేశారని, అలాగే అసభ్యంగా మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నరసింహ యాదవ్, నంద్యాల నాగేంద్ర కుమార్, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావుచౌదరి, బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-24T05:06:49+05:30 IST