కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం
ABN, First Publish Date - 2021-08-29T05:14:45+05:30
కర్నూలులో శనివారం లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది.
కర్నూలు(లీగల్), ఆగస్టు 28: కర్నూలులో శనివారం లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి లోకాయుక్త కార్యాలయాన్ని ప్రారంభించారు. లోకాయుక్త కార్యాలయం హైదరాబాదుకు బదులుగా కర్నూలులో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 26న ఏపీ లోకాయుక్త ఉపలోకాయుక్త చట్టంలోని 12వ రూల్ను సవరణ చేస్తూ జీవో జారీ చేశారు. ఇంతవరకు లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలు హైదరాబాదు నుంచే కొనసాగాయి. ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. కార్యక్రమంలో లోకాయుక్త రిజిస్ట్రార్ ఎం.విజయలక్ష్మి, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎఫ్.అబ్దుల్ కరీమ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
దేవదాయశాఖపై తొలి ఫిర్యాదు
గ్రామంలో తాము నడుపుతున్న దేవాలయాన్ని ఇకనుంచి దేవదాయశాఖకు స్వాధీనం చేయాలంటూ కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన 80 ఏళ్ల వరలక్ష్మమ్మ శనివారం లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డికి తొలి ఫిర్యాదు అందజేశారు. 50 ఏళ్ల క్రితం తన భర్త కాశీ నుంచి శివలింగాన్ని తీసుకువచ్చి.. గ్రామంలో శివాలయాన్ని, నరసింహస్వామి దేవాలయాన్ని సొంత ఖర్చులతో నిర్మించారని, ఆయన మృతి చెందిన తర్వాత తాను వృద్ధాప్యంతో ఆ దేవాలయాన్ని నడపలేకపోతున్నామని ఆమె తెలిపారు. దేవాలయం కోసం తాము ఇచ్చిన భూమితో పాటు దేవాలయాలను కూడా స్వాధీనం చేసుకోవాలని తాను దేవదాయశాఖకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా వారు సరిగా స్పందించడం లేదన్నారు. ఈ మేరకు లోకాయుక్త ఆమె ఫిర్యాదును స్వీకరించారు.
Updated Date - 2021-08-29T05:14:45+05:30 IST