మద్యం మత్తులో పల్లెలు
ABN, First Publish Date - 2021-05-31T05:43:03+05:30
పల్లెల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కోడుమూరు(రూరల్)/సి.బెళగల్, మే 30: పల్లెల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమంగా సాగుతున్న మద్యం అమ్మకాలను కట్టడి చేయడంలో అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని పలువురు వాపోతున్నారు. కోడుమూరు మండలంలోని గోరంట్ల, అమడగుంట్ల, లద్దగిరి, పులకుర్తి, ప్యాలకుర్తి, వర్కూరు తదితర గ్రామాల్లో అక్రమ మద్యం దందా దర్జాగా సాగుతోంది. కర్ణాటక, తెలంగాణ బ్రాండ్ల మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఏపీ మద్యం ధరలు పెరగడం, కొత్త బ్రాండ్లపై మద్యం ప్రియులు ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. లద్దగిరి, అల్లినగరం గ్రామాల్లో నాటుసారా గుప్పుమంటోంది. వెల్దుర్తి కొండ ప్రాంతాల్లో తయారవుతున్న నాటుసారాను ప్లాస్టిక్ కవర్లలో ఇక్కడికి తరలిస్తున్నారు. లీటరు రూ.300 చొప్పున నాటుసారా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. అక్రమ మద్యం అమ్ముకునే వారు బైక్లో ఉంచుకుని సాయంత్రం గ్రామ వీధుల్లో తిరుగుతూ మద్యం ప్రియులకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్లో ఆర్డరు తీసుకుని కూడా సరఫరా చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ మద్యంపై పరిమాణం బట్టి రూ.50 నుంచి రూ 100 వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ విషయంపై ఎస్ఈబీ ఎస్ఐ శంకర్ వివరణ కోరగా అక్రమ మద్యం పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం గురించి 9440902575 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
సి.బెళగల్ మడలంలోని తుంగభద్ర నది తీర గ్రామాలైన తిమ్మనదొడ్డి, సంగాల, పల్దొడ్డి, కొండాపురం, ముడుమాల ఈర్లదిన్నె శింగవరం, కొత్తకోట గ్రామాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ కూత వేటుదూరంలో ఉండటంతో ఆయా గ్రామాలలో తెలంగాణ మద్యాన్ని తెచ్చి అమ్ముతున్నట్లు పలువురు చెబుతున్నారు. మద్యం విక్రయాలను అరికట్టాలని ఆయా గ్రామాల మహిళలు కోరుతున్నారు.
Updated Date - 2021-05-31T05:43:03+05:30 IST