నాలుగు వరుసల రహదారులు
ABN, First Publish Date - 2021-04-23T05:14:24+05:30
విజయవాడకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఎన్హెచ్ఏఐను ప్రభుత్వం ఆదేశించింది.
- జిల్లాలో 161 కిలో మీటర్ల పొడవు
- డీపీఆర్ సిద్ధం చేస్తున్న ఎన్హెచ్ఏఐ
కర్నూలు(అర్బన్), ఏప్రిల్ 22: విజయవాడకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ఎన్హెచ్ఏఐను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని రెండు మార్గాల్లో దాదాపుగా 161 కిలోమీటర్ల పొడవున ఈ నాలుగు వరుసల రహదారి నిర్మాణమవు తుంది. కర్నూలు నుంచి ఆత్మకూరు, దోర్నాల వరకు 131 కి.మీ., కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, గిద్దలూరు మీదుగా 130 కి.మీ. రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు అందా యి. అనంతపురం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి 544డీని విస్తరించేందుకు భూసేకరణతో కలిపి రూ.9 వేల కోట్ల మేర వ్యవయమవుతుందని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అంచనా వేసింది. బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు వరకు 417 కి.మీ. మేర ఈ రహదారి ఉంది. ఇందులో గిద్దలూరు నుంచి వినుకొండ వరకు 112 కి.మీ. ఓ ప్యాకేజీలో నాలుగు వరుసల విస్తరణ పనులు ముగింపు దశకు వచ్చాయి. అనంతపురం-బుగ్గ, బుగ్గ-గిద్దలూరు, వినుకొండ-గుంటూరు మధ్య మూడు ప్యాకేజీలకు డీపీఆర్లు సిద్ధం చేయాలని ఎన్హెచ్ఏఐ ఉన్నతాధి కారుల నుంచి ఆదేశాయి వచ్చాయి. వీటిలో అనంతపురం-బుగ్గ మధ్య రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో నాలుగు వరుసలుగా రోడ్డును విస్తరించారు. దీన్ని ఎన్హెచ్ఏఐ ప్రమాణాలతో తాజాగా అభివృద్ధి చేయనున్నారు. వినుకొండ నుంచి నరసరావు పేట మీదుగా గుంటూరు వరకు 90 కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఈ మూడు ప్యాకేజీల డీపీఆర్ల తయారీకి టెండర్లు పిలిచి, సలహా సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
కర్నూలు-దోర్నాల మధ్య..
కర్నూలు నుంచి గుంటూరు, విజయ వాడ చేరుకునేందుకు కీలకమైన కర్నూలు- దోర్నాల జాతీయ రహదారి 340సీని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమైంది. కర్నూలు నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు మీదుగా దోర్నాల వరకు 131 కి.మీ. రహదారి విస్తరణకు రూ.1,834 కోట్లు వ్యయమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. దీని డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవనున్నారు. తర్వాత దశలో దోర్నాల నుంచి కుంట వద్ద ఎన్హెచ్ 544డిలో కలిపేలా మిగిలిన భాగాన్ని కూడా విస్తరించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో కర్నూలు- దోర్నాల రహదారికి సర్వేలు పూర్తి కాగా, బనగానపల్లె- గిద్దలూరుకు రహదారికి సర్వే, డిజైన్లకు ఏజెన్సీ నివేదికలు ఇవ్వలేదని, ఆ ప్రక్రియ పూర్తయ్యక డీపీఆర్ చేపడతామని అధికారులు చెబుతున్నారు.
డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం
కర్నూలు, దోర్నాల, కోవెలకుంట్ల, బనగానపల్లె, గిద్దలూరు రహదారులను నాలుగు వరుసల రహదారులుగా తయారు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేయాలి. అయితే ప్రస్తుతం కర్నూలు, దోర్నాల రహదారికి అవసరమైన డీపీఆర్ సిద్ధమవుతోంది. కానీ గిద్దలూరు రహదారి సర్వే, ప్రణాళికలకు ఏజెన్సీ నుంచి ఇంకా నివేదిక రాలేదు. రాగానే ఆ రహదారికి డీపీఆర్ సిద్ధం చేస్తాం. - సురేష్కుమార్, పీడీ, ఎన్హెచ్ఏఐ
Updated Date - 2021-04-23T05:14:24+05:30 IST