ఆసుపత్రి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్
ABN, First Publish Date - 2021-12-08T05:30:00+05:30
Hospital work must be completed: Collector
డోన్, డిసెంబరు 8: ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. డోన్ పట్టణ సమీపంలోని రుద్రాక్ష గుట్టలో జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఏపీ ఎంఎస్ఐడీసీ ఈఈ సదాశివారెడ్డిని అడిగి ఆసుపత్రి పనుల పురోగతి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ.26 కోట్లతో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
‘ఓటీఎస్పై బలవంతం లేదు’
వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కు సంబంధించి డబ్బులు కట్టాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం డోన్ పట్టణంలోని 1వ సచివాలయంలో ఓటీఎస్పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఓటీఎస్పై అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, వైస్ చైర్మన్లు కోట్రికే హరికిషణ్, జాకీర్ హుశేన్ పాల్గొన్నారు.
కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మహిళ
ప్యాపిలి: ఓటీఎస్ డబ్బుల కోసం వలంటీర్ ఒత్తిడి చేస్తున్నారని మండలంలోని ఏనుగమర్రి గ్రామంలో శ్వేత అనే మహిళ కలెక్టర్ కోటేశ్వరావుకు ఫిర్యాదు చేశారు. బుధువారం ఏనుగమర్రి గ్రామంలో నిర్వహించి ఓటీఎస్ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ మహిళ కలెక్టర్ను కలసి తన గోడును తెలిపింది. తనకు 2007లో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని, అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ ఇంటిని పదేళ్ల క్రితమే విక్రయించానని తెలిపారు. అయితే వలంటీరు జాబితాలో తన పేరు ఉందని, డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఇంటిని విక్రయించినందున ఓటీఎస్తో తనకు సంబంధం లేదని డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని మహిళకు సూచించారు. గతంలోనే ఇంటిని విక్రయించిన లబ్ధిదారులను ఓటీఎస్ డబ్బులను అడగవద్దని ఆయన అధికారులకు తెలిపారు. హౌసింగ్ ఈఈ నాగరాజు, డీఈ మధుసూదన్రెడ్డి, తహసీల్దారు శివరాముడు, ఎంపీడీవో ఫజుల్ రెహమాన్, సర్పంచ్ మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST