ఆస్పత్రిలో ప్రసవం కష్టం
ABN, First Publish Date - 2021-11-01T05:03:38+05:30
ప్రభుత్వ వైద్యశాలకు వెళితే గర్భిణికి ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడతారనే నమ్మకం ప్రజల్లో పోతోంది.
- సిజేరియన అయితే కర్నూలుకే
- ఆపరేషన థియేటర్ లేదు.. సరిపడా వైద్యులు లేరు
- ఆత్మకూరు ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో అన్నీ సమస్యలే
ఆత్మకూరు, అక్టోబరు 31: ప్రభుత్వ వైద్యశాలకు వెళితే గర్భిణికి ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడతారనే నమ్మకం ప్రజల్లో పోతోంది. ఆత్మకూరు క్లస్టర్ ఆసుపత్రిలో ఈ పరిస్థితి తలెత్తింది. ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు చేసి, తగిన సూచనలు ఇవ్వాలి. కానీ ఆత్మకూరు ఆస్పత్రిలో అది కరువైపోయింది. ఇక్కడ సాధారణ కాన్పులయితేనే చేస్తున్నారు. ప్రసవం కష్టమైతే ఆదుకోడానికి వైద్యులు లేరు. గైనకాలజిస్ట్, అనస్తీషియా నిపుణుల పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఎక్స్రే, స్కానింగ్ తదితర పరికరాలు పని చేయడం లేదు. రక్తనిధిలో కావాల్సిన బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వెళితే అత్యవసర పరిస్థితుల్లో గర్భిణుల ఇబ్బందులు చెప్పడానికి లేదు. సాధారణ కాన్పుకు అవకాశం లేకుంటే వెంటనే కర్నూలు జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. పురిటి నొప్పులతో తల్లడిల్లే గర్భిణిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోతున్నారు. స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియనకు రూ. వేలు వసూలు చేస్తున్నారు.
- ఆత్మకూరు క్లస్టర్ వైద్యశాలకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి నుంచేగాక పాములపాడు, కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని సుమారు 77 గ్రామాలు, చెంచుగూడేల నుంచి గర్భిణులు వస్తుంటారు. అయితే అక్కడ కాన్పు చేస్తారనే నమ్మకం లేకుండా పోయింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఖర్చు భరించాల్సి రావడమే గాక ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదు.
- వాస్తవానికి ఆత్మకూరు క్లస్టర్ వైద్యశాల పరిధిలో ప్రతి నెలా 40కిపైగా సాధారణ కాన్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే స్థాయిలో ప్రతి నెలా సాధారణ ప్రసవాలు సాధ్యంగాకపోవడంతో, ఆస్పత్రిలో వైద్యులు లేక, ఇతర సౌకర్యాలు లేక కర్నూలు జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా.. అనుకోని ఇబ్బంది తలెత్తితే బాధ్యత వహించాల్సి వస్తుందని ముందస్తుగానే ఇక్కడి వైద్యులు కర్నూలుకు పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తనిధి కేంద్రంలో అవసరానికి తగిన రక్తం లేకపోవడంతో గర్భిణిలు ఆందోళన చెందుతున్నారు.
సిజేరియన ఆపరేషన్లపై శ్రద్ధ వహించాలి :
ఆత్మకూరు క్లస్టర్ వైద్యశాల పరిధిలో సిజేరియన ఆపరేషన్లు చేయడానికి ఆపరేషన థియేటర్, పరికరాలను, వైద్యులను, సిబ్బందిని నియమించడానికి వైద్య అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శ ఉంది. ప్రసవ కష్టాలను గుర్తించిన వైద్యశాఖ కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకున్నది. కొద్దిరోజు ల్లోనే సిజేరియన ఆపరేషన్లు చేసేందుకు ప్రత్యేకమైన ఆపరేషన థియేటర్, అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకరానున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు గైనకాలజిస్టులు, పీడియార్టిస్ట్, అనస్తీషియా వైద్యులను, అదనపు వైద్య సిబ్బందిని నియమించినప్పుడే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐటీడీఏ అధికారులైనా పట్టించుకోరా..?
ఆత్మకూరు డివిజన పరిధిలోని గూడేల చెంచు మహిళలు కాన్పుకు ఈ ప్రభుత్వ వైద్యశాలకే వస్తుంటారు. ఇక్కడ వసతులు లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఐటీడీఏ అధికారులైనా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఆత్మకూరు క్లస్టర్ వైద్యశాల పరిధిలో సిజేరియన ఆపరే షన్లు చేయడానికి సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే గైనకాలజిస్ట్, పీడియార్టిస్ట్, అనస్తీషయా డాక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు.
- డాక్టర్ వెంకటరమణ, ఆత్మకూరు క్లస్టర్ వైద్యశాల సూపరింటెండెంట్
Updated Date - 2021-11-01T05:03:38+05:30 IST