ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం: నారాయణమూర్తి
ABN, First Publish Date - 2021-03-01T18:10:00+05:30
పంచాయతీ ఎన్నికల్లో 82 శాతంపైగా ఓటింగ్ జరగడం శుభపరిణామమని... మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్ఈసీని కోరామని వైసీపీ నేత నారాయణమూర్తి తెలిపారు.
అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో 82 శాతంపైగా ఓటింగ్ జరగడం శుభపరిణామమని... మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్ఈసీని కోరామని వైసీపీ నేత నారాయణమూర్తి తెలిపారు. వివిధ పార్టీ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిర్వహించిన సమావేశంలో వైసీపీ నేతలు నారాయణమూర్తి, పద్మజ పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నేత మాట్లాడుతూ ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తోన్న వ్యవహారాలపై ఎస్ఈసీ దృష్టికి తెచ్చామని చెప్పారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఒడిపోతామని వైసీపీ నేతల వాహనాలను టీడీపీ వారు దహనం చేస్తున్నారని ఎస్ఈసీకి తెలియజేశామని వెల్లడించారు. వాలంటీర్ల హక్కులు కాలరాయొవద్దని, హక్కులను కాపాడాలని కోరినట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాలని ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపామన్నారు. ఏదేని అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించడం సాధ్యం కాదని సమావేశంలో చెప్పామన్నారు. వాలంటీర్లను నిర్భంధించినట్లు అవుతుందని ఇలా చేయడం సరికాదని తెలిపామని ఎస్ఈసీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఓటమి పాలవుతున్నామనే టీడీపీ నేతలు ఎస్ఈసీపై విమర్శలు చేస్తున్నారని నారాయణమూర్తి పేర్కొన్నారు.
వైకాపా అధికార ప్రతినిధి పద్మజ మాట్లాడుతూ... అత్యధిక మెజారిటీతో వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నిబంధనల పేరుతో వాలంటీర్ల మొత్తం వ్యవస్థను నిలుపుదల చేయవద్దని కోరామన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరినట్లు తెలిపారు.
Updated Date - 2021-03-01T18:10:00+05:30 IST