విశాఖలో హత్యలు.. విజయవాడలో ఉలిక్కిపాటు
ABN, First Publish Date - 2021-04-16T06:51:32+05:30
విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున జరిగిన..
ఏడాది క్రితం విజయవాడ వలస వచ్చిన విజయ్
భార్యాపిల్లలను కోల్పోయి..
ఆంధ్రజ్యోతి- విజయవాడ: విశాఖపట్నంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఆరు హత్యలు విజయవాడ నగరంలో కలకలాన్ని రేపాయి. మృతుల్లో నలుగురు విజయవాడకు చెందిన వారే ఉన్నారు. విశాఖపట్నం పెందుర్తికి చెందిన విజయ్ విజయవాడకు చెందిన ఉషను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. తమ ప్రాంతానికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తితో వివాదాలు ఉండటంతో విజయ్ 2019లో భార్య బిడ్డలతో కలసి విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో ఉన్న అత్తగారి ఇంటికి వచ్చేశాడు. అతని మామ టైల్స్ వర్క్ చేస్తుండగా, విజయ్ అదే రోడ్డులో సెల్ఫోన్లకు గొరిల్లా గ్లాసులను వేసే షాపు పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయటానికి భార్య ఉష, ముగ్గురు పిల్లలతో పాటు అత్తగారిని కూడా తీసుకుని పెందుర్తి వెళ్లాడు. ఉష సోదరికి విజయ్ బంధువుల్లో ఒక వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.
వచ్చే నెలల్లో ఆ కార్యక్రమం జరగాల్సి ఉంది. శుభలేఖలను ఇవ్వటంతో పాటు, పెళ్లికి నూతన వస్త్రాలను కొనుగోలు చేసే పని ముగించుకుని, తిరిగి విజయవాడ రావటానికి అక్కడ అంతా సిద్ధం చేసుకున్నారు. ఉష, ఆమె తల్లి, చిన్న కుమారుడు ఉదయ్నందన్, కుమార్తె ఉర్విష, మరి కొందరు పెందుర్తిలోని విజయ్ ఇంటి వద్దనే ఉన్నారు. అప్పలరాజుతో ఉన్న వివాదాల కారణంగా విజయ్, అతని పెద్ద కుమారుడు వేరే చోట బంధువుల ఇంట్లో ఉన్నారు. గురువారం వీరంతా కలసి విజయనగరం వెళ్లి, అక్కడ బంధువులకు శుభలేఖలు ఇచ్చి తిరిగి రావలసి ఉంది. ఇంతలోనే అప్పలరాజు విజయ్ భార్య ఉష, రెండవ కుమారుడు ఉదయ్నందన్, కుమార్తె ఉర్విషలను దారుణంగా నరికి చంపేశాడు. పక్కనే పడుకున్న ఉష తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో అప్పలరాజు రక్తపాతాన్ని సృష్టించాడు.
విజయవాడలో కలకలం
విజయ్ కుటుంబ సభ్యులు ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారని, సమాచారం వచ్చినప్పటికీ, విజయవాడలో వారి ఇంటి చుట్టుపక్కల వారు తొలుత నమ్మలేదు. విజయ్, అతని కుటుంబ సభ్యులు అందరితో చాలా బాగుండేవారని స్థానికులు చెబుతున్నారు. విజయ్ తండ్రి రమణ లాక్డౌన్ సమయంలో విజయవాడలోనే ఉండి, పుచ్చకాయల వ్యాపారం చేశాడని, లాక్డౌన్ తరువాత పెందుర్తి వెళ్లిపోయారని తెలుస్తోంది. విజయ్ చిన్నాన్న, మరికొందరు బంధువులు విజయవాడలోనే ఉంటున్నారు. వారంతా ఘటన గురించి తెలియటంతో హుటాహుటిన వైజాగ్ వెళ్లారు.
Updated Date - 2021-04-16T06:51:32+05:30 IST