ముమ్మరంగా వరి నాట్లు
ABN, First Publish Date - 2021-07-21T06:17:15+05:30
ముమ్మరంగా వరి నాట్లు
రూరల్లో నెల ఆలస్యంగా ఖరీప్ సీజన్
నేడు నున్నకు చేరనున్న పట్టిసీమ నీళ్లు
విజయవాడ రూరల్, జూలై 20 : పది రోజులుగా రోజూ వర్షాలు కురుస్తుండటంతో ఎట్టకేలకు విజయవాడ రూరల్ మండలంలో వరినాట్లు ముమ్మరంగా జరుగుతు న్నాయి. ఇప్పటి వరకు బోర్ల కింద ఆయకట్టు రైతులు వరి నాట్లు వేసుకోగా, రెండు మూడు రోజుల నుంచి కాల్వ కింద ఆయకట్టులోనూ వరినాట్లు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చితే నెల రోజులు ఆలస్యమైనప్పటికీ, ఎడతెరిపిలేని వర్షాలతో పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. దీంతో రైతులు వారం రోజుల నుంచి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. నెల రోజుల క్రితం పోసిన నారు నాటు దశకు చేరింది. దీంతో రైతులు నారు పీకించి వరినాట్లు వేయిస్తున్నారు. కాల్వలకు నీటి విడుదలలో ఆలస్యం జరగడం వల్ల చాలా మంది రైతులు నార్లు పోయలేదు. అలాంటి రైతులు ఇతర ప్రాంతాల నుంచి నారును కొనుగోలు చేసుకుని, నాట్లు వేస్తున్నారు. దీనికితోడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీటిని పోలవరం కాల్వలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ఆ నీరు బుధవారం నున్నకు చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో చెరువుల కింద ఉన్న ఆయకట్టుదారులు కూడా తమ పంట పొలాలను నాట్లు వేసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. మండలంలోని నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, మంగళాపురం, పీ నైనవరం, అంబాపురం, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లోని రైతులు వ్యవసాయ పనులలో బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్లొలపూడి ఎత్తిపోతల పథకం (జీపీఎస్) కాల్వ కింద ఆయకట్టు రైతులు వరి నాట్లలో బీజీ అయ్యారు. పోలవరం కాల్వలోకి గోదావరి నీళ్లు వస్తే, మోటార్ల ద్వారా గోదావరి నీటిని చెరువులకు పెట్టుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో చెరువు ఆయకట్టును కూడా సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
Updated Date - 2021-07-21T06:17:15+05:30 IST