టీడీపీ నేతల హత్య వెనక ఎమ్మెల్యే కాటసాని హస్తం: చంద్రబాబు
ABN, First Publish Date - 2021-06-17T17:23:03+05:30
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలను హతమారుస్తున్నారని... పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో, లేదో అనుమానం కలుగుతోందని తెలిపారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో పట్టపగలే టీడీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిని కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో హతమార్చడం దారుణమన్నారు. అసలు వారు మనషులా...నరరూప రాక్షసులా! అని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యల వెనక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.
ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అధికారపార్టీకి తొత్తుగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారన్నారు. దేశంలో మరెక్కడా ఇటువంటి అవాంఛనీయ ఘటనలు లేవని తెలిపారు. రాష్ట్రం జరుగుతున్న హత్యాకాండకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత అని అన్నారు. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు...కబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Updated Date - 2021-06-17T17:23:03+05:30 IST