మరో గండం!
ABN, First Publish Date - 2021-11-25T06:30:37+05:30
వాతావరణ మార్పులు రైతులను వణికిస్తూనే ఉన్నాయి.
రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు
రైతుల్లో తీవ్ర ఆందోళన జూ కోతలు పూర్తయింది కొంతే
పొలాల్లోనే అత్యధిక పైరు
కోతలు పూర్తయిన చోట విక్రయాల్లో జాప్యం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : వాతావరణ మార్పులు రైతులను వణికిస్తూనే ఉన్నాయి. అకాల వర్షాలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న పైరుతో పాటు, కోసి ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దవుతున్నాయి. ఈ స్థితిలో మళ్లీ అల్పపీడనధ్రోణి కారణంగా కోస్తాతీరం వెంబడి శుక్రవారం నుంచి ఆదివారం వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడం రైతులను మరింత కలవరపాటుకు గురిచేసింది. ఇప్పటికే వాతావరణంలో గంటకో విధంగా చోటుచేసుకుంటున్న మార్పులతో వరి కోయాలా? వద్దా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని కొద్ది మంది యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసినా, ఆరబెట్టిన ధాన్యాన్ని అకస్మాత్తుగా కురుస్తున్న వర్షం తడిపేస్తోంది. బుధవారం రాత్రి కూడా అకస్మాత్తుగా వర్షం పడడంతో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు.
ఇప్పటివరకు 7,175 హెక్టార్లలో పంట నష్టం
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.38 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. పైరు చాలావరకు కోతకు సిద్ధంగా ఉన్నా, భారీ వర్షాలు అవరోధంగా మారాయి. రెండు రోజులుగా వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో అవకాశం ఉన్న ప్రాంతాల్లో యంత్రాల ద్వారా కోతలు పూర్తి చేసి, ధాన్యాన్ని ఆరబెట్టారు. బుధవారం అకస్మాత్తుగా కురసిన వర్షం కారణంగా ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. మళ్లీ గురువారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు కోత కోయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే ఇప్పటికే కోతలు ఊపందుకునేవి. వర్షం కారణంగా జిల్లాలో ఇప్పటివరకు 10వేల హెక్టార్లలో మాత్రమే కోతలు పూర్తయినట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని 23 మండలాలు, 237 గ్రామాల పరిధిలో 7,170 హెక్టార్లలో వరి, పత్తి, వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నట్టు బుధవారం నాటికి ప్రాథమిక అంచనా వేసినట్టు వ్యవసాయశాఖ జేడీ టి.మోహనరావు తెలిపారు.
విక్రయాలకు అనుమతుల్లో జాప్యం
ధాన్యం విక్రయించాలంటే రైతులు ఆర్బీకేలకు వెళ్లి ధాన్యం శాంపిళ్లను ఇవ్వాల్సి ఉంది. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించిన అనంతరం ఆర్బీకే పరిధిలోని ఫలానా మిల్లుకు రైతులు ధాన్యం విక్రయించాలని ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇందుకు సంబంధించిన అనుమతులు ఇప్పటివరకు ఇవ్వకపోవడం, మిల్లులను ఆర్బీకేలకు ట్యాగింగ్ చేయకపోవడంతో సీజన్ ప్రారంభంలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేసి, ధాన్యాన్ని విక్రయించేందుకు మిల్లులు, ఆర్బీకేల వద్దకు వెళితే అనుమతులు రాలేదనే సమాధానం ఎదురువుతోందని గుడ్లవల్లేరు, అంగ లూరు గ్రామాలకు చెందిన రైతులు చెబుతున్నారు.
Updated Date - 2021-11-25T06:30:37+05:30 IST