మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవటం హర్షణీయం: బాలకోటయ్య
ABN, First Publish Date - 2021-11-19T18:28:30+05:30
మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవటం హర్షణీయమని పోతుల బాలకోటయ్య అన్నారు.
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవటం హర్షణీయమని బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆందోళనలకు, ప్రజాభిప్రాయానికి పాలకులు తల దించాల్సిందేనన్నారు. ఇది వ్యవసాయ బిల్లులపై సుదీర్ఘ కాలం పోరాటం చేస్తున్న రైతుల విజయమన్నారు. చారిత్రాత్మక పోరాట పటిమకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకున్నట్లే, ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రైతు ఉద్యమాన్ని మోదీ గౌరవించినట్లే, సీఎం రాజధాని రైతుల ఉద్యమాన్ని గౌరవించాలన్నారు. భేషజాలకు పోకుండా రైతుల మహాపాదయాత్ర నేపథ్యంలో మోదీ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కొనసాగించాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు పాలకులు వెనక్కి తగ్గటం తప్పుకాదని బాలకోటయ్య అన్నారు.
Updated Date - 2021-11-19T18:28:30+05:30 IST