తెరవెనుక.. నా సామీ!
ABN, First Publish Date - 2021-02-12T06:03:38+05:30
తెరవెనుక.. నా సామీ!
రెండో విడత ప్రచారం పరిసమాప్తం
ప్రలోభాలకు రంగం సిద్ధం
ఎక్కువ పంచాయతీల్లో పోటాపోటీ
గెలుపు కోసం భారీగా డబ్బు పంపకాలు
కైకలూరు, మండవల్లి మండలాల్లో బెట్టింగులు
గుడివాడ డివిజన్లో 175 సర్పంచ్ పదవులకు 458 మంది అభ్యర్థులు
1,025 వార్డులకు 2,112 మంది పోటీ
గుడివాడ, ఫిబ్రవరి 11 : రెండో విడత ఎన్నికల ప్రచారానికి గురువారం తెరపడింది. గుడివాడ డివిజన్ పరిధిలో 211 పంచాయతీలకు గానూ 36 పంచాయతీ సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవమైన విషయం విదితమే. మిగిలిన 175 పంచాయతీల సర్పంచ్ పదవులకు 458 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1,968 పంచాయతీ వార్డులకు 940 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,025 వార్డుల్లో సభ్యులుగా ఎన్నికవడానికి 2,112 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులు మాత్రం ఓటరు నాడి తెలియక తలలు పట్టుకుంటున్నారు. రకరకాల ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఇళ్ల స్థలాలు పోతాయని, ఇళ్ల పట్టాలు లాగేసుకుంటారని, రేషన్కార్డు, పింఛన్లు గల్లంతవుతాయని వలంటీర్లతో కలిసి అధికారపక్ష కార్యకర్తలు, నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తనయుడు, అతని అనుచరగణం ప్రతి గ్రామంలోనూ తిష్టవేసి తమకు ఓటు వేయాలని హుకుం జారీ చేస్తున్నారు. స్థానిక నాయకులకు టార్గెట్లు విధిస్తూ ఒత్తిడి చేస్తున్నారు.
ముదినేపల్లి మండల కేంద్రంలో టీడీపీ, వైసీపీల నడుమ హోరాహోరీ పోరు నెలకొంది. టీడీపీ తరఫున ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలే... అధికార పక్షానికి దీటైన పోటీ ఇస్తుండటం విశేషం.
హోరాహోరీ పోరు నెలకొన్న ముదినేపల్లి మండలం ఈదేపల్లిలో ఓటుకు అత్యధిక ధర పలికే సూచనలు ఉన్నాయి. ఇరువర్గాలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పరిశీలకుల అంచనా.
ముదినేపల్లి మండలం దాకరం, చిగురుకోటలో వలంటీర్లు అధికారపక్షం తరఫున ప్రచారం చేస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.
పేరూరు, పెదగొన్నూరు, దేవపూడి, అల్లూరు, బొమ్మినంపాడు, వైవాకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
నందివాడ మండలం వెన్ననపూడిలో వైరిపక్షాలు ఒకరికి తీసిపోకుండా మరొకరు ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
డివిజన్లోని పలు గ్రామాల్లో గురువారం ఆయా అభ్యర్థుల తరఫున మహిళలు ఇంటింటికీ బొట్టు పెట్టి తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఓటు వేయడానికి తామే పోలింగ్ కేంద్రాలకు తోడ్కొని వెళ్తామని హామీలు గుప్పిస్తున్నారు.
నందివాడ మండలంలో పోలుకొండ, రుద్రపాక, ఇలపర్రు, రామాపురం, వెంకట రాఘవాపురం, నందివాడల్లో ఇరువర్గాల నడుమ పోటాపోటీ వాతావరణం నెలకొంది. అంతిమంగా ధన ప్రవాహానికి వెనుకాడటం లేదు. పైచేయి సాధిస్తే వారినే విజయం వరిస్తుందనే చర్చ నడుస్తోంది.
కలిదిండి మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లోనూ హోరాహోరీ వాతావరణం నెలకొంది. పామర్రు, పెదపారుపూడి మండలాల్లో 36 గ్రామ పంచాయతీల్లో అఽధికార, ప్రతిపక్షాల నడుమ గట్టి పోటీనే ఏర్పడింది.
వైసీపీ తరఫున ఎమ్మెల్యే అనిల్కుమార్, టీడీపీ తరఫున ఆ పార్టీ మండల అడహక్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.
కైకలూరు, మండవల్లి మండలాల్లోని కొల్లేరు గ్రామాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. మండవల్లి మండలంలోని లింగాల, కైకలూరుల్లో వైసీపీ, టీడీపీ మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే అంశంపై భారీ ఎత్తున బెట్టింగ్లు సాగుతున్నాయి.
Updated Date - 2021-02-12T06:03:38+05:30 IST