ఆరేపల్లి కుటుంబానికి ముద్దరబోయిన పరామర్శ
ABN, First Publish Date - 2021-05-07T05:35:59+05:30
ఆరేపల్లి కుటుంబానికి ముద్దరబోయిన పరామర్శ
ఆగిరిపల్లి, మే 6: ఆరేపల్లి శ్రీనివాసరావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, ప్రత్యుర్థులు రాజకీయ వైరంతో పెట్టిన అక్రమ కేసులు నిలవబోవని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీనివాసరావు భార్య తోటపల్లి సర్పంచ్ ఆరేపల్లి శ్రీపద్మను గురువారం ఆయన పరామర్శించి, ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో జగన్ పరిపాలన మాదిరిగా స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు పెంచి పోషిస్తూ తనకు అనుకూలంగా లేని వారిని అధికార బలంతో పోలీసులను అడ్డుపెట్టుకుని అణగదొక్కుతున్నారన్నారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చిట్నేని వెంకట శివరామకృష్ణ, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకులకు నోటీసులు దుర్మార్గం
టీడీపీ నాయకులకు ఆగిరిపల్లి ఎస్సై పి.కిషోర్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్దబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. తోటపల్లి మాజీ సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు అరెస్టును నిరసిస్తూ, అక్రమ కేసు ఎత్తివేయాలన్న డిమాండ్తో బీసీ సాధికార సమాఖ్య ఆధ్వర్యంలో టీడీపీ, మిత్రపక్షాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్మీట్ ఏర్పాటు చేశారని, క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని నోటీసుల్లో పేర్కొన్నారన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రెస్మీట్ పెడితే నోటీసులు ఇచ్చినవారు వైసీపీ నాయకులు పొన్నం విజయ కన్వెన్షన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలీసులకు ఇటువంటి వివక్ష తగదని వారు ఉద్యోగులుగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు.
Updated Date - 2021-05-07T05:35:59+05:30 IST