రామ మందిర నిర్మాణానికి.. ఎంపీ సుజనా కుటుంబం రూ.2.2కోట్ల విరాళం
ABN, First Publish Date - 2021-01-25T15:45:34+05:30
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి..
విజయవాడ(ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తన తండ్రి యలమంచిలి జనార్థనరావు పేరుతో తమ కుటుంబం తరపున రూ.2.2కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని వెన్యూ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. శ్రీరాముడిలా విలువలకు కట్టుబడి ఉంటే జీవితంలో ఉన్నతస్థాయి పొందవచ్చన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్ మాట్లాడుతూ 500 ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతోందని, ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు గర్వించే క్షణాలన్నారు. రామ మందిర నిర్మాణంలో భాగమయ్యేందుకు ఎంతోమంది ఉత్సాహంగా విరాళాలు ఇస్తున్నారని, తన వంతుగా రూ. 5లక్షల 116 ప్రకటించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రూ.5లక్షలు, సీసీఎల్ రూ.6కోట్ల 39లక్షలు, సిద్ధార్థ అకాడమీ తరపున రూ. 15లక్షల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ ప్రాంత సంచాలక్ భరత్ జీ, వీహెచ్పీ జాతీయ నేత రాఘవులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-25T15:45:34+05:30 IST