రైతుల సంక్షేమానికి రూ.68వేల కోట్లు
ABN, First Publish Date - 2021-05-14T15:05:34+05:30
రైతుల సంక్షేమానికి..
మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
పాయకాపురం: రైతుల సంక్షేమానికి రూ.68 వేల కోట్లను ఖర్చు చేసి రైతు పక్షపాతి ప్రభుత్వమని నిరూపించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పథకం కింద 3వ సంవత్సరం మొదటి విడత నగదు సహాయాన్ని రైతుల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రజా ప్రతినిధులు, రైతు సోదరులతో కలసి మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన కింద 3వ ఏడాది రాష్ట్రంలోని 52 లక్షల 38 వేల మంది రైతులకు రూ.3 వేల 928 కోట్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు రూ.17 వేల 29 కోట్లను రైతులకు అందించామన్నారు. రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ ఉచిత వ్యవసాయ బీమా పథకం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, ఇతర పంటల కొనుగోలు, రైతులకు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని అరకోటి మందికి పైగా రైతులకు 23 నెలల నుంచి రూ.68 కోట్లు అందించామన్నారు.
ప్రస్తుత కరోనా కష్టకాలంలో రైతులు, పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అనుకున్న సమయానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 3 లక్షల 26 వేల 326 మంది రైతులకు రూ.7,500 చప్పున రూ.244.74 కోట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మాధవీలత, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, శాసన సభ్యులు మల్లాది విష్ణు, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, వసంత కృష్ణ ప్రసాద్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-14T15:05:34+05:30 IST