వరదే కృష్ణరూపిణీ
ABN, First Publish Date - 2021-08-03T05:58:31+05:30
వరదే కృష్ణరూపిణీ
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది. విజయవాడ కృష్ణలంకతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాలలో నది ఒడ్డున ఉన్న భవానీ ముక్తేశ్వరస్వామి ఆలయం నీట మునిగింది. కృష్ణా, పాలేటి నదుల సంగమమైన రావిరాల వద్ద పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పంటపొలాలు నీటమునిగాయి. వేదాద్రి వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్- వేదాద్రి ఎత్తిపోతల పథకం వద్దకు నీరు చేరటంతో అప్రమత్తమైన కాంట్రాక్టు సిబ్బంది సంబంధిత మెటీరియల్ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపం లోని నదిలో ఉన్న సాలగ్రామ నరసింహ స్వామి విగ్రహం నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్టులోని 24 గేట్లకు గానూ 17 గేట్లను ఎత్తి 3.54 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పవర్ జనరేషన్ ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు కిందకు వస్తోంది. ఎగువ నుంచి పులిచింతలకు 17.3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని సమాచారం.
- జగ్గయ్యపేట రూరల్/విజయవాడ సిటీ
Updated Date - 2021-08-03T05:58:31+05:30 IST