ఎయిడెడ్ పాఠశాలల మూసివేత తుగ్లక్ చర్య: Potina
ABN, First Publish Date - 2021-11-11T16:37:10+05:30
విద్యార్ధుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.
విజయవాడ: విద్యార్ధుల జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటోందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలను మూసి వేయడం తుగ్లక్ చర్య అని అన్నారు. వేల కోట్లు విలువ చేసే ఆస్తులను దోచుకునేందుకే ఎయిడెడ్ పాఠశాలలను స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు కార్పొరేట్ స్కూల్స్లో ఫీజులు చెల్లించగలరా అని ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయడం దుర్మార్గమని అన్నారు. జగన్ కపట నాటకాలు అందరికీ అర్ధమైపోతున్నాయన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, లాఠీఛార్జి చేస్తారా అని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా తమ అవినీతి మంత్రి వెల్లంపల్లి స్పందించరని... దేవుని ఆస్తులను దోచుకోవడం, దాచుకోవడమే ఆయనకు తెలుసని వ్యాఖ్యానించారు. సీఎం స్పందించి ఎయిడెడ్ నిర్ణయాన్ని మార్చుకోవాలని... లేకుంటే లక్షలాది మంది విద్యార్థులు తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడించే రోజు వస్తుందని పోతిన వెంకట మహేష్ హెచ్చరించారు.
Updated Date - 2021-11-11T16:37:10+05:30 IST