తొలి విడతలో 1.5 లక్షల గృహాల నిర్మాణం
ABN, First Publish Date - 2021-02-27T06:16:04+05:30
తొలి విడతలో 1.5 లక్షల గృహాల నిర్మాణం
విజయవాడ సిటీ: జిల్లాలో మొదటి విడతలో 1.5 లక్షల గృహాల నిర్మాణం చేస్తామని, లే అవుట్ల అభివృద్ధి, గృహాల నిర్మాణానికి రెవెన్యూ, గృహ నిర్మాణ, డ్వామా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. లే అవుట్ల అభివృద్ధి, జియో మ్యాపింగ్, ట్యాగింగ్పై జేసీలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, గృహ నిర్మాణ, డ్వామా అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్ను వారం లోపు పూర్తి చేయాలని, రోజువారీ నివేదికను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు తమ పరిధిలోని మండలాల్లో లే అవుట్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. వెదురు పావులూరు- 1, 2, వెలగలేరు, కొండపల్లి, వణుకూరు, ఉప్పులూరు మచిలీపట్నం అర్బన్, నున్న లే అవుట్లలో సమస్యలను నివేదిక రూపంలో శుక్రవారం సాయ్రంతం నాటికి సమర్పించాలని, వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు. డీ-మార్కింగ్ కాని చోట్ల వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 1,445 లే అవుట్లకు 4,376 ఎకరాల భూమి సేకరించామన్నారు. జేసీలు కె.మాధవీలత, ఎల్.శివశంకర్, సబ్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, ఆర్డీవోలు ఖాజావలి, శ్రీనుకుమార్, గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్రం పాల్గొన్నారు.
Updated Date - 2021-02-27T06:16:04+05:30 IST