భూ కబ్జాపై నివేదిక ఇవ్వండి
ABN, First Publish Date - 2021-04-16T06:49:21+05:30
మహ్మదీయ కో-ఆపరేటివ్ సొసైటీ లేఔట్లోని మాస్టర్ ప్లాన్ రోడ్ల కబ్జా విషయంలో కలెక్టర్ ఇంతియాజ్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశం
రంగంలోకి రెవెన్యూ యంత్రాంగం
36 ఎకరాల్లో సర్వేకు నిర్ణయం
కలెక్టర్కు వారంలో సమగ్ర నివేదిక
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
భవానీపురం, ఏప్రిల్ 15 : మహ్మదీయ కో-ఆపరేటివ్ సొసైటీ లేఔట్లోని మాస్టర్ ప్లాన్ రోడ్ల కబ్జా విషయంలో కలెక్టర్ ఇంతియాజ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మంత్రి అనుచరులు ఈ లేఔట్లో రోడ్లను కబ్జా చేసి, స్థలాల కింద విక్రయిస్తున్న అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన కలెక్టర్ 36 ఎకరాల లేఔట్ను సమగ్రంగా సర్వే చేసి, పూర్తిస్థాయి నివేదికను వారంలోగా అందజేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పశ్చిమ తహసీల్దార్ ఎం.మాధురి మహ్మదీయ సొసైటీ భూముల కబ్జాపై ఆరా తీశారు. ఈ సొసైటీ భూములను సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని సర్వేయర్ బేగ్ను ఆదేశించారు. గురువారం సర్వేయర్ బేగ్, వీఆర్వో సిరివెన్నెల తదితరులు సొసైటీ లేఔట్లోని 40 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు ముస్తాక్, అమ్మపాద అపార్టుమెంట్ ప్లాట్లదారులతో తహసిల్దార్ మాట్లాడారు. 49 సెంట్ల స్థలంను అమ్మపాద అపార్టుమెంట్లో కలిపేసుకున్నారని, వారికి నడక మార్గం ఇది కాదని దర్గా కమిటీ నాయకులు వాదనకు దిగడంతో ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని ఆమె సూచించారు. లేఔట్ ప్రకారం కబ్జాదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నించింది రోడ్డా లేక కామన్సైటా అన్నది తేల్చి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై మాధురి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేయించి, వారంలోగా నివేదికను సమర్పిస్తానని చెప్పారు.
Updated Date - 2021-04-16T06:49:21+05:30 IST