చెరువు చెరపట్టి..
ABN, First Publish Date - 2021-07-03T05:49:44+05:30
చెరువు చెరపట్టి..
ముసునూరు మండలం యల్లాపురంలో అనధికార చేపల చెరువులు
అనుమతులు లేకుండానే తవ్వకాలు
గతంలో ఒకటి, తాజాగా మరొకటి
నాశనమవుతున్న పంట పొలాలు
కలుషితమవుతున్న కాటమ్మ చెరువు
ప్రశ్నార్థకంగా 300 ఎకరాల ఆయకట్టు
జీవనాధారం కోల్పోయి లబోదిబోమంటున్న రైతులు
బంగారు పంటలు పండే మెట్టభూమి.. సాగుకు చేదోడుగా ఆ పక్కనే పేద్ద చెరువు.. సిరులు కురిపించే ఈ ప్రాంతంపై అక్రమార్కుల కన్ను పడింది. అంతే.. ఏకంగా చేపల చెరువులు తవ్వేశారు. వ్యవసాయ బోర్లకే అనుమతి లేనిచోట చేపలు, రొయ్యల సాగుకు ఏర్పాటుచేసిన బోర్ల విద్యుత్ కనెక్షన్లకు అధికారులు అనుమతులు ఇచ్చేశారు. ఇంకేముంది.. నిత్యం పచ్చగా కళకళలాడే ఆ ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. చేపల చెరువు నీరు ఊటబారి పచ్చటి పంటలు నాశనమయ్యాయి. నిత్యం జల సంపదతో నిండుకుండగా ఉండే చెరువు కలుషితమైంది. నూజివీడు డివిజన్లోని ముసునూరు మండలం యల్లాపురం పంట పొలాలు, కాటమ్మ చెరువులో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వ్యాపారం ఇది.
ముసునూరు, జూలై 2 : నూజివీడు డివిజన్లోని నూజివీడు, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, తిరువూరు మండలాలు మెట్ట ప్రాంతాలు. ఇక్కడ వ్యవసాయం ఆద్యంతం బోర్ల కిందే సాగవుతుంది. భూగర్భ జలాలు అడుగంటాయని ఈ ఏరియాలను డాట్ ప్రాంతాలుగా గుర్తించి వ్యవసాయ బోర్లను నిషేధించారు. అయితే, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలను ఆసరాగా తీసుకుని, అక్రమార్కులు మెట్ట ప్రాంతంలో ఏకంగా చేపలు, రొయ్యల చెరువులను తవ్వేస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించటంతో ఈ అనధికార చేపల చెరువులకు నీటి సరఫరా నిమిత్తం విద్యుత్ కనెక్షన్లు కూడా మంజూరు చేశారు. ఈ చెరువుల పుణ్యమాని భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు పక్కన ఉన్న 44 ఎకరాల చెరువు విస్తీర్ణంతో పాటు సుమారు 300 ఎకరాల ఆయకట్టు బలహీనపడుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బాధిత రైతులు ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు.
కలుషితమవుతున్న కాటమ్మ చెరువు
ముసునూరు మండలం యల్లాపురం గ్రామంలో అనధికార చేపల చెరువుల ఏర్పాటుపై గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందట గ్రామంలోని కాటమ్మ చెరువు ఆయకట్టులోని 20 ఎకరాలను పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుకు చెందిన వ్యక్తి లీజుకు తీసుకుని చేపల చెరువుగా మార్చాడు. అలాగే, మరో 20 ఎకరాల భూమిని కూడా చేపల చెరువుగా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు. చెరువు ఏర్పాటు చేసినపుడు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, చెరువులో రొయ్యల పెంపకం చేపట్టాక సమీప పొలాలు ఊట బారి సాగుకు పనికిరాకుండా పోతున్నాయి. రొయ్యలు పట్టే సమయంలో నీటిని పక్కనే ఉన్న కాటమ్మ చెరువులోకి వదలటంతో చెరువు ఆయకట్టు సాగుకు పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో పశుపక్షాదులకు ఈ నీరే ఆధారం. చెరువు కలుషితం కావడంతో వాటికి తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది.
అనుమతులు ఇచ్చారా లేదా?
గ్రామీణ ప్రాంతాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేయాలంటే పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యతో పాటు వివిధ శాఖల అనుమతులు తీసుకోవాలి. అయితే, యల్లాపురంలోని చెరువుల ఏర్పాటుకు ఎవరూ అనుమతులు ఇవ్వలేదు. అయినా నీటి సరఫరాకు ఏర్పాటుచేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేశారు. కొన్ని సంవత్సరాలుగా ముసునూరు మండల పరిధిలో వేలాది మంది రైతులు వ్యవసాయ బోర్లకు దరఖాస్తులు చేసుకుని అనుమతులు రాక ఇప్పటికీ వేచి చూస్తున్నారు. అలాంటిది ఈ చెరువులకు మాత్రం అధికారులు ఆగమేఘాలపై అనుమతులు జారీ చేయడంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
సప్లై చానల్ ఆక్రమణ
కాటమ్మ చెరువుకు నీటిని సరఫరా చేసే సప్లై చానల్ను సైతం చేపల చెరువు నిర్మాణంలో ఆక్రమించి కట్టలు నిర్మించారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కాటమ్మ చెరువుకు నీటి లభ్యత తగ్గిపోయిందని, దీనితోడు పంట భూములు వరద ముప్పునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. అక్రమ చేపల చెరువుల ఏర్పాటుపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని గ్రామస్థులు, రైతులు ఆరోపిస్తున్నారు. చేపల చెరువులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అనుమతుల్లేవ్
చేపల చెరువుల ఏర్పాటుకు అనుమతులు లేవు. యల్లాపురంలో జరుగు తున్న చేపల చెరువు తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం. గతంలో ఏర్పాటుచేసిన చెరువుకు రెవెన్యూ అనుమతులు ఇవ్వలేదు. ఉన్నతాధి కారులకు సమాచారం అందించి, చర్యలు తీసుకుంటాం.
- ఎం.పాల్, తహసీల్దార్
Updated Date - 2021-07-03T05:49:44+05:30 IST