చెప్పు..కోలేని కష్టం
ABN, First Publish Date - 2021-04-17T05:14:02+05:30
చెప్పు..కోలేని కష్టం
సర్వర్ డౌన్తో అంతంతమాత్రంగానే కరోనా పరీక్షలు
మండుటెండలో బాధితుల పడరాని పాట్లు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కొవిడ్ పరీక్షలు.. బాధితుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. పరీక్షలు చేయించుకునేందుకు ఇందిరాగాంధీ స్టేడియం వద్ద శుక్రవారం ఉదయం నుంచి చాలామంది మండు టెండలో పడిగాపులు కాశారు. చిన్నపిల్లలు, యువతీ యువకులు, నడివయస్కులు, వృద్ధులు.. ఎర్రటి ఎండలో పడరాని పాట్లు పడ్డారు. పరీక్షకు గంటల తరబడి సమయం పడుతుండటంతో చెప్పులు క్యూలో పెట్టి నీడలో సేదతీరారు. పరీక్షలకు కొత్తగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి రావడం, ఒత్తిడి పెరిగిపోయి సర్వర్ డౌన్ కావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగింది. ఇందిరా గాంధీ స్టేడియంతో పాటు దండిమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, గుణదల చర్చి వద్ద వారం రోజులుగా ఇదే పరిస్థితి. కరోనా పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే జనం బారులు తీరుతుండగా, మధ్యాహ్నానికి గానీ ఆరోగ్య సిబ్బంది రావడం లేదు. దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో గురువారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో అనారోగ్య పీడితులు వచ్చి క్యూలో నిలబడ్డారు. అయితే, మధ్యాహ్నమైనా సిబ్బంది రాకపోవడంతో వారంతా ఎండలో నానా అవస్థలు పడ్డారు. కొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు.
Updated Date - 2021-04-17T05:14:02+05:30 IST