విశాఖకు రాజధాని తరలింపు పిచ్చి తుగ్లక్ నిర్ణయం: Tulasi reddy
ABN, First Publish Date - 2021-07-23T18:10:37+05:30
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలనేది పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.
విజయవాడ: ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలనేది పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి రాజధాని తరలింపును ఆపాలని డిమాండ్ చేశారు. రాజధానిని ముక్కలు చేస్తే అధికార వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతిలో రాజధాని బంగారు బాతు..నిధుల కొరత అనేదే లేదని చెప్పారు. వరదలు వచ్చినప్పుడు అమరావతి ముంపు బారిన పడదని తేలిందని ఆయన అన్నారు. అమరావతిలో ఒకే వర్గం వారు ఉన్నారనడం సహేతుకం కాదని....అన్ని వర్గాల వారు ఉన్నారని తెలిపారు. విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ప్రత్యేక హోదాపై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసి వైఫల్యం చెందిందని అన్నారు. ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలకు గాను కేవలం 11 వేల ఉద్యోగాలు మాత్రమే జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రిలిజ్ చేసిందన్నారు. మిగిలిన 2 లక్షల 40 వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రతి నెల 2 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. రాయలసీమలో ఉండే కాపు మహిళలకు కాపునేస్తం వర్తించడం లేదని తెలిపారు. ప్రభుత్వం రాయలసీమలోని కాపు పేద మహిళలకు కాపు నేస్తం వర్తింపచేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2021-07-23T18:10:37+05:30 IST