‘స్పందన’తో సమస్యలకు పరిష్కారం
ABN, First Publish Date - 2021-07-27T04:52:03+05:30
ప్రజా ఫిర్యాదుల వేదిక స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు వేగవంతంగా పరిష్కారం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి
కడప (కలెక్టరేట్), జూలై 26 : ప్రజా ఫిర్యాదుల వేదిక స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు వేగవంతంగా పరిష్కారం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. సోమ వారం కలెక్టరేట్లోని స్పందన హాలులో కొవిడ్ ప్రభావం కారణంగా నిలిపివేసిన స్పందన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభించారు. తొలిరోజు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరై తమ విన్నపాలను జాయింట్ కలెక్టర్లు, ఉన్నతాధికారులకు తెలియచేశారు. ఈ సందర్భంగా జేసీ గౌతమి మాట్లాడుతూ కొవిడ్ కారణంగా నిలిపి వేసిన స్పందన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం యధావిధిగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరం రవీంద్రనగర్కు చెందిన షేక్ కలీముల్లా ఫిర్యాదు చేస్తూ 1980లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద నగర పరిధిలోని చిన్నచౌకు సర్వే నెంబర్లు 1044, 45, 59, 60లలో దాదాపు 27 ఎకరాల 91 సెంట్లు కేటాయించారన్నారు. అయితే ఆ స్థలాలను కో-ఆపరేటివ్ సొసైటీ వారు ఆక్రమించి అమ్ముకున్నారని న్యాయం చేయాలన్నారు. చిన్నమండెం, బోరెడ్డిపేటకు చెందిన నిర్మల తమ ఊరిలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇప్పించాలని కోరగా పడమటికోనకు చెందిన రవీంద్ర కూడా ఉద్యోగం ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. తన భూమికి పట్టాదారు పాస్పుస్తకం ఆన్ లైన్ చేయాలని బి.మఠం అగ్రహారానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేసింది. కార్యక్రమంలో జేసీలు సీఎం సాయికాంత్వర్మ, ఎ.ధర్మచంద్రారెడ్డి, ధ్యాన్చంరఽధ, డీఆర్వో మలోల, అధికారులు రామమోహన్, పద్మజ, యధుభూషణ్రెడ్డి, అనిల్ కుమార్, మురళీకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2021-07-27T04:52:03+05:30 IST