దారుణం: పెళ్లికి అంగీకరించనందుకు.. కూతురిపై..
ABN, First Publish Date - 2021-06-17T05:38:24+05:30
తాము చెప్పిన చోట..
పెళ్లికి అంగీకరించనందుకు కూతురిపై పెట్రోలు పోసి కాల్చారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
ముగ్గురు నిందితుల అరెస్టు
రాయచోటి(కడప): తాము చెప్పిన చోట పెళ్లికి అంగీకరించకపోవడంతో కోపంతో.. కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లిదండ్రులు, తమ్ముడిపై రాయచోటి అర్బన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం రాయచోటి డీఎస్పీ వాసుదేవన్ స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె రహిమాన్ వీధికి చెందిన పటాన్ మహమ్మద్ షరీఫ్, మున్వార్ జహాన్ దంపతులు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు.. అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది నచ్చని ఆమె.. వాళ్లు ఏ సంబంధం చూపించినా పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపధ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు, తమ్ముడు ఆ యువతితో గొడవ పడ్డారు.
తాము చెప్పిన సంబంధం చేసుకోవడం లేదంటూ కోపంతో పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆమె తండ్రి మహమ్మద్ షరీఫ్, తల్లి మున్వార్ జహాన్, తమ్ముడు తాజుద్దీన్లపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిని బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో అర్బన్ సిఐ రాజు, ఎస్ఐ మహ్మద్ రఫి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-17T05:38:24+05:30 IST